- ఉన్నత విద్యా మండలి నిర్ణయం
- ఆర్బీఐ ఆఫీసర్లు, ఆర్థిక వేత్తలతోనూ క్లాసులు
- నాలుగు కాలేజీల్లో బీఏ ఆనర్స్ ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ కోర్సులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 2021–22 విద్యా సంవత్సరం నుంచి బీఏ ఆనర్స్లో కొత్తగా ప్రవేశపెట్టిన ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ క్లాసులను సీనియర్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఆర్బీఐ ఉన్నతాధికారులు, సీనియర్ ఆర్థిక వేత్తలతో చెప్పించాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. ఈ మేరకు సిలబస్, కరికులమ్ రెడీ చేసింది. క్లాస్ వర్క్తో సమానంగా ఫీల్డ్, ప్రాజెక్టు వర్క్ ఉండేలా ప్లాన్ చేసింది. ఈ ఏడాది నుంచి మొత్తం 4 కాలేజీల్లో నిజాం కాలేజీ, కోఠి ఉమెన్స్ కాలేజీ, సిటీ కాలేజీ, బేగంపేట ఉమెన్స్ డిగ్రీ కాలేజీల్లో బీఏ ఆనర్స్ కోర్సులు అమలు చేయనున్నారు. పొలిటికల్ సైన్స్లో సీనియర్ ఎంపీలు, ఎమ్మెల్యేలతో.. ఎకనామిక్స్ క్లాసులను ఆర్బీఐ ఆఫీసర్లు, ఆర్థిక వేత్తలతో చెప్పించాలని నిర్ణయించింది. సాధ్యమైనంత వరకు ఆఫ్లైన్లో పాఠాలు చెప్పించాలని, అవసరాన్ని బట్టి వర్చువల్ క్లాసులు కూడా నిర్వహించాలని భావిస్తోంది. ముఖ్యమైన టాపిక్స్ వారితో చెప్పిస్తే స్టూడెంట్లు త్వరగా అవగాహన చేసుకుంటారని ఉన్నత విద్యా మండలి అభిప్రాయపడింది. ఈ కోర్సులో మేజర్ సబ్జెక్టు నుంచి 60–70% క్రెడిట్స్, మైనర్ సబ్జెక్టులకు 30–40% క్రెడిట్స్ ఇవ్వనున్నారు. గెస్టు లెక్చరర్లతో పాటు రిటైర్డ్ లెక్చరర్ల సేవలనూ వినియోగించుకోనున్నారు. క్లాసు రూమ్ పాఠాలతో సమానంగా ఇంటర్న్ షిప్, ప్రాక్టికల్స్కు ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారు. “ఈ ఏడాది 4 కాలేజీల్లో పైలెట్ ప్రాజెక్టుగా ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ కోర్సులను ప్రారంభించాం. రానున్న రోజుల్లో మరిన్ని కాలేజీల్లో ప్రవేశపెడతాం” అని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు.
23 వరకు దోస్త్ థర్డ్ ఫేజ్ రిజిస్ర్టేషన్లు
డిగ్రీ కాలేజీల్లో థర్డ్ ఫేజ్ రిజిస్ర్టేషన్లు, వెబ్ ఆప్షన్ల గడువును ఈ నెల 23 వరకు పెంచుతున్నట్టు దోస్త్ కన్వీనర్ లింబాద్రి తెలిపారు. కొత్తగా బీఏ ఆనర్స్ కోర్సులను నిజాం కాలేజీ, కోఠి ఉమెన్స్ కాలేజీ, సిటీ కాలేజీతో పాటు బేగంపేట ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో ప్రవేశ పెడుతున్నందున గడువు పెంచినట్టు చెప్పారు.