శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్(SVBC) లో ఒఎస్ఒ( అటెండర్)గా విధులు నిర్వహిస్తున్న ఒక ఉద్యోగిని బుధవారం విధుల నుండి తొలగించినట్లు తెలిపారు ఎస్వీబీసీ సిఇవో. ఈ ఏడాది సెప్టెంబరు నెలలో వెంకట క్రిష్ణ అనే భక్తుడు శతమానం భవతి కార్యక్రమానికి సంబందించిన వివరాలను ఇ-మెయిల్ ద్వారా కోరారు. అందుకు ఎస్వీబీసీ ఉద్యోగి sb@svbcttd.org నుండి భక్తుడికి అశ్లీల వెబ్ సైట్ కు సంబంధించిన లింక్ పంపించారు. దీనిపై భక్తుడు టిటిడి ఛైర్మన్, ఈవోలకు పిర్యాదు చేశారు.
ఈ విషయంపై స్పందించిన టిటిడి చైర్మన్ శ్రీ వై.వి. సుబ్బారెడ్డి, ఈవో డా.కె.ఎస్.జవహర్ రెడ్డి విచారణకు ఆదేశించారు. విచారణలో భాగంగా టిటిడికి చెందిన 25 మంది సాఫ్ట్ వేర్ ఇంజినీర్లతో ఎస్వీబీసీలోని అన్ని కంప్యూటర్లను సెక్యూరిటీ అడిట్ చేశారు. సైబర్ సెల్ టీం దర్యాప్తులో మరో ముగ్గురు లేదా నలుగురు ఉద్యోగులు ఇలాంటి పనులు చేసినట్లు తెలిసింది. ఇంకా ఎంతమంది ఉద్యోగులు ఇలాంటి పనులు చేశారో పరిశీలించి వారిని కూడా ఉద్యోగం నుండి తొలగిస్తామని తెలిపారు ఎస్వీబీసీ సిఇవో. ఈ విచారణలో వాస్తవాలు రుజువు అయినందున ఎస్వీబీసీ ఉద్యోగి వెంకట క్రిష్ణని వెంటనే ఉద్యోగం నుండి తొలగించామన్నారు.
ఈ సంఘటన తర్వాత సంస్థ ప్రతిష్టను పరిరక్షించడంలో భాగంగా పలు విధానపరమైన నిర్ణయాలు తీసుకుందన్నారు. ఇకపై ఎస్వీబీసీ కంప్యూటర్ ఆపరేషన్ టీటీడీ ఐటీ విభాగం పర్యవేక్షణలో జరుగుతుందని.. ఎస్వీబీసీలో ప్రతి కంప్యూటర్ కు పాస్వర్డ్ ఏర్పాటు చేస్తామన్నారు. దీంతో ఏ కంప్యూటర్ ను ఎవరు ఉపయోగిస్తున్నారు అనేది తెలుస్తుందని.. ఎస్వీబీసీని టీటీడీ విజిలెన్స్ పర్యవేక్షణలోనికి తీసుకురావాలని నిర్ణయించామన్నారు.