లోక్ సభ ఎలక్షన్స్ : కొనసాగుతున్న ఐదో దశ పోలింగ్

లోక్ సభ ఎలక్షన్స్ : కొనసాగుతున్న ఐదో దశ పోలింగ్

ఐదో దశలో 7 రాష్ట్రాల్లోని 51 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. రాజకీయ ప్రముఖులు చాలా మంది ఉదయమే ఓటు వేశారు. కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ లక్నోలోని స్కాలర్స్ హోమ్ స్కూల్ లో ఓటు వేశారు. మళ్లీ మోడీయే ప్రధాని అంటూ రాజ్ నాథ్ కామెంట్ చేశారు. అటు జైపూర్ లో మరో కేంద్రమంత్రి రాజ్యవర్దన్ సింగ్ రాథోడ్.. తన భార్య గాయత్రి రాథోడ్ తో కలిసి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈవీఎంలో సాంకేతిక సమస్య ఎదురవడంతో రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ కొద్ది సేపు వేచి చూడాల్సి వచ్చింది.

బీఎస్పీ అధినేత్రి మాయావతి లక్నోలోని సిటీ మాంటెస్సోరి ఇంటర్ కాలేజ్ లో ఓటు వేశారు. ప్రజలంతా ఓటింగ్ లో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు మాయావతి. బెంగాల్ లోని హౌరాలో కొన్ని చోట్ల ఈవీఎంలు సరిగా పని చేయకపోవడంతో పోలింగ్ ఆలస్యమైంది. అటు అమేథీలోనూ ఈవీఎంలలో లోపాలతో పోలింగ్ ఆలస్యమైంది. అనంతనాగ్ లోక్ సభ స్థానంలో పోలింగ్ కట్టుదిట్టమైన భద్రత మధ్య సజావుగా సాగుతోంది. కశ్మీరీలు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటేస్తున్నారు.