హైదరాబాద్ లో చిరుత కలకలం రేపింది. కాటేదాన్ ప్రాంతంలోని జాతీయ రహదారి.. మైలార్ దేవ్ పల్లిలోని అండర్ పాస్ బ్రిడ్జి వద్ద గాయాలతో రోడ్డుపై పడిఉన్న చిరుతను స్థానికులు గమనించారు. ఆ చిరుతను చూసిన స్థానికులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. పులిని చూసిన ప్రజలు భయాందోళనతో పరుగులు తీశారు. అయితే పులి గాయాలతో ఉండటంతో ఎటూ కదలలేక కాసేపు అలాగే ఉండి పోయింది. పులి రోడ్డు మీదే ఉందని తెలిసి కూడా చాలా మంది వాహనదారులు నిర్లక్ష్యంగా అటూ ఇటూ తిరిగారు.
ఓ లారీ డ్రైవర్ అయితే చిరుతను చూడ్డానికి ప్రయత్నించాడు. దీంతో అది అతనిపై దాడి చేసి పారిపోయింది. దాని ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్న అటవీ శాఖ సిబ్బంది.. అది ఎక్కడుందో తెలిసిన వెంటనే బంధిస్తామని చెబుతున్నారు. విషయం తెలుసుకున్న మైలార్ దేవునిపల్లి పోలీసులు చిరుత డ్రైవర్ ను దాడి చేసిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ లారీ డ్రైవర్ ను ఆస్పత్రికి తరలించారు. పులి ప్రస్తుతం ఎక్కడ ఉందో.. ఏ సమయంలో ఎవరిపై దాడి చేస్తుందోనని నగరవాసులు భయాందోళనతో ఉన్నారు.