కొండపాక, వెలుగు: పెద్దలు పెళ్లికి ఒప్పుకోరన్న ఆందోళనతో ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా కొండపాక మండల పరిధిలోని లకుడారం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మంజే కనకయ్య(21), రాచకొండ తార(19) స్థానిక జడ్పీ హై స్కూల్లో తొమ్మిదో తరగతి వరకు చదువుకున్నారు. ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. మూడేళ్ల క్రితం తార కుటుంబ సభ్యులు కనకయ్యను గ్రామానికి పిలిపించి మందలించారు. కనకయ్య హైదరాబాద్ వెళ్లి పెయింటర్ గా పని చేశాడు. కొన్ని నెలలుగా గ్రామంలోనే కూలి పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తార గ్రామంలోనే బీడీలు చుడుతూ కుటుంబసభ్యులతోనే ఉంటోంది. వీరిద్దరి కులాలు వేరు కావడంతో పెద్దలు పెళ్లికి ఒప్పుకోరని ఆందోళనకు గురయ్యారు.
బుధవారం కనకయ్య 11 గంటలకు గ్రామం నుంచి బయటకు వెళ్లాడు. తార ఫారెస్ట్ లో పని నిమిత్తం ఇంట్లో నుంచి వెళ్లింది. ఇద్దరూ సాయంత్రమైనా ఇళ్లకు రాకపోవడంతో అన్ని ప్రాంతాల్లో వెతికారు. గురువారం ఉదయం స్కూల్ ఆవరణలో చెట్లకు నీళ్లు పట్టడానికి వెళ్లినవారు తరగతి గదిలో ఇద్దరూ ఉరేసుకుని ఉండడంతో చూసి గ్రామస్థులకు తెలిపారు. వారికి సమీపంలో పురుగుల మందు డబ్బా ఉంది. ముందు పురుగుల మందు తాగి తర్వాత ఉరేసుకుని ఉంటారని భావిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం శవాలను సిద్దిపేట ఏరియా హాస్పిటల్కు తరలించారు.