
- 31కి చేరిన బాధితుల సంఖ్య
- కుక్కను కొట్టి చంపిన మున్సిపల్ సిబ్బంది
హుజూరాబాద్, వెలుగు: హుజూరాబాద్ పట్టణంలో పిచ్చి కుక్కల స్వైర విహారం ఆగడం లేదు. గురువారం తెల్లవారుజామున రోడ్లు ఊడుస్తున్న ఆరుగురు శానిటేషన్ వర్కర్లతో పాటు అటుగా వెళ్తున్న మరో ముగ్గురిపై పిచ్చి కుక్క దాడి చేసింది. అలాగే, బుధవారం ఉదయం జమ్మికుంట నుంచి వచ్చిన ఒక పిచ్చి కుక్క హుజూరాబాద్ పట్టణంలోని విద్యానగర్ గాంధీనగర్, ప్రతాపవాడ, మామిండ్లవాడ కాలనీల్లో సాయంత్రం, రాత్రి వేళల్లో సుమారు 25 మందిని పైగా కరిచి తీవ్రంగా గాయపర్చిన విషయం తెలిసిందే.
వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అదే కుక్క బోర్నపల్లి మీదుగా సైదాపూర్ మండలం చింతలపల్లికి వెళ్లి మళ్లీ గురువారం హుజూరాబాద్కు చేరుకుంది. తెల్లవారుజామున శానిటేషన్ విధులకు వెళ్తున్న గాంధీ నగర్కు చెందిన పర్లపేల్లి భాగ్య, మాడుగుల విజయపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. శానిటరీ సూపర్వైజర్ ఆరెల్లి రమేశ్ను సైతం కుక్క కరిచింది. మామిండ్లవాడలో కూడా ఇద్దరు పారిశుధ్య సిబ్బందిని గాయపరిచింది.
ఒకేసారి వేర్వేరు చోట్ల ఒకే కుక్క ఆరుగురు శానిటరీ వర్కర్లను కరవడంతో మిగతా వర్కర్లు ఆందోళనకు గురవుతున్నారు. అదే కుక్క డీసీఎంఎస్ కాంప్లెక్స్ మీదుగా గాంధీనగర్ వైపు వెళ్తుండగా మున్సిపల్ సిబ్బంది, కుక్కలు పట్టే వ్యక్తులు దానిని పట్టుకునే క్రమంలో దాడి చేయడంతో కుక్క మృతి చెందింది.