మాదాపూర్, వెలుగు: ఐదు రోజుల కిందట జరిగిన రౌడీషీటర్ హత్య కేసును మాదాపూర్ పోలీసులు ఛేదించారు. పాత కక్షల కారణంగా ముగ్గురు వ్యక్తులు రౌడీషీటర్ను చంపినట్లు తేల్చారు. ఈ కేసులో ఆ ముగ్గురితో పాటు ట్రాన్స్ జెండర్ను అరెస్ట్ చేశారు. బుధవారం మాదాపూర్ పీఎస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ శ్రీనివాస్ కేసు వివరాలు వెల్లడించారు. బోరబండ ప్రాంతానికి చెందిన నదీమ్ హుస్సేన్(30) ఫ్లవర్ డెకరేటర్గా పనిచేస్తున్నాడు. సనత్నగర్, బోరబండ పరిధిలో హత్య కేసుల్లో నదీమ్ నిందితుడిగా ఉన్నాడు. దీంతో బోరబండ పోలీసులు అతడిపై రౌడీషీట్ తెరిచారు. బోరబండ ప్రభుత్వ స్కూల్ ఏరియాకు చెందిన ఆటో డ్రైవర్ షేక్ అజీజ్ అహ్మద్(20), సేల్స్మెన్ షేక్ రిజ్వాన్(19), చెత్త సేకరణ చేసే మహేశ్(21) ముగ్గురూ ఫ్రెండ్స్. వీరికి నదీమ్తో పాత గొడవలు ఉన్నాయి. తన వ్యవహారాల్లో కలుగజేసుకుంటే చంపేస్తానని చాలాసార్లు అజీజ్ను నదీమ్ బెదిరించాడు. దీంతో నదీమ్ను చంపేందుకు అజీజ్ తన ఫ్రెండ్స్ రిజ్వాన్, మహేశ్తో కలిసి స్కెచ్ వేశాడు.
బర్త్ డే పార్టీకి పిలిచి.. మద్యం తాగించి..
ప్లాన్ ప్రకారం అజీజ్ ఓ కత్తిని ఆన్ లైన్లో ఆర్డర్ చేసి తన దగ్గర పెట్టుకున్నాడు. ఈ నెల 13న నదీమ్కు కాల్ చేసి తన ఫ్రెండ్ మహేశ్బర్త్ డే ఉందని.. పార్టీ చేసుకుందామని పిలిచాడు. ముందుగా అజీజ్, నదీమ్ ఇద్దరూ బైక్ పై మాదాపూర్ పరిధి భాగ్యనగర్ సొసైటీలోని ఖాళీ ప్రదేశానికి వెళ్లి మద్యం తాగారు. అర్ధరాత్రి దాటిన తర్వాత 2.30 గంటలకు రిజ్వాన్, మహేశ్అక్కడికి చేరుకున్నారు. అజీజ్, రిజ్వాన్తమ వెంట తెచ్చుకున్న కత్తులతో నదీమ్ పొట్ట, వీపు బాగాల్లో పొడిచారు. కత్తితో గొంతు కోశారు. ఆ తర్వాత ముగ్గురూ అక్కడి నుంచి పరారయ్యారు. అజీజ్ కేపీహెచ్ బీ కాలనీలో ఉండే తనకు తెలిసిన ట్రాన్స్ జెండర్ శ్యామలా దేవి(32) ఇంటికి వెళ్లాడు. రక్తపు మరకలు అంటిన షర్ట్ను అమెకు ఇచ్చాడు. ఆమె ఆ షర్ట్ను తగులబెట్టింది. ఇందుకోసం శ్యామలకు అజీజ్ డబ్బులు ఇచ్చాడు. మరోవైపు నదీమ్ హత్య ఘటనపై సమాచారం అందుకున్న మాదాపూర్ పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం నాలుగు టీమ్స్తో గాలించారు. అజీజ్ను లింగంపల్లిలో, రిజ్వాన్, మహేశ్ను తాండూరులో పట్టుకున్నారు. సాక్ష్యాలను మాయం చేయడమే కాకుండా నిందితుడికి ఆశ్రయం కల్పించిన శ్యామలా దేవిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 2 కత్తులు, 2 బైక్ లు, 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.