
మహారాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో హిందీని తప్పనిసరి చేయాలనే వివాదాస్పద భాషా విధాన తీర్మానాలను ఉపసంహరించుకుంది. ఈ నిర్ణయం హిందీని రుద్దడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో విస్తృత వ్యతిరేకత, నిరసనలు వెల్లువెత్తడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
మహారాష్ట్ర క్యాబినెట్ ఆదివారం (జూన్ 29) త్రిభాషా విధానం అమలుకు సంబంధించిన రెండు ప్రభుత్వ తీర్మానాలను (GRs) ఉపసంహరించుకుంది. ఏప్రిల్ 16న జారీ చేసిన మొదటి GR..1 నుండి 5 తరగతుల విద్యార్థులకు హిందీని తప్పనిసరి మూడవ భాషగా చేసింది. జూన్ 17న దీనిని సవరించి హిందీని ఐచ్ఛికం చేశారు. ఇప్పుడు ఈ రెండు తీర్మానాలను ఇవాళ ఉపసంహరించారు.
ALSO READ | Census 2026: జనాభా లెక్కల తొలి అడుగు..గృహాల లెక్కింపుతో ప్రారంభం
ఈ విధానం మరాఠీ భాష, సంస్కృతి ప్రాముఖ్యతను దెబ్బతీస్తుందని ప్రతిపక్ష పార్టీలు, విద్యావేత్తలు ,తల్లిదండ్రుల నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. శివసేన (యూబీటీ), మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) వంటి పార్టీలు హిందీని రుద్దడాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలకు పిలుపునిచ్చాయి.
భవిష్యత్తులో భాషా విద్యా విధానంపై సిఫార్సులు చేసేందుకు డాక్టర్ నరేంద్ర జాదవ్ నేతృత్వంలో కొత్త నిపుణుల కమిటీ ఏర్పాటుచేస్తున్నట్లు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు.
ప్రస్తుత ప్రభుత్వంపై హిందీని రుద్దడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. అయితే ఫడ్నవీస్ గత సీఎం ఉద్ధవ్ ఠాక్రే హయాంలో డాక్టర్ రఘునాథ్ మాషెల్కర్ కమిటీ సిఫార్సులను అంగీకరించారని..ఇది త్రిభాషా సూత్రాన్ని ప్రవేశపెట్టడానికి దారితీసిందని చెప్పారు. ఈ నిర్ణయంతో హిందీని రుద్దడానికి వ్యతిరేకంగా జూలై 5న జరగాల్సిన నిరసన ప్రదర్శనలు రద్దు అయ్యాయి.