
2026 జనాభా లెక్కల ప్రక్రియను వేగవంతం చేసింది కేంద్ర ప్రభుత్వం. మొదటిదశ జనాభా లెక్కలకు సన్నాహాలు ప్రారంభించింది. మొదట ఇండ్ల సంఖ్య, వాటిస్థితిగతులను లెక్కించేందుకు సిద్దమవుతోంది. ఇండ్ల లెక్క తేలిన తర్వాత రెండో దశ జనాభా లెక్కల ప్రక్రియ చేపట్టనుంది. జనాభా లెక్కలతోపాటు ప్రతిష్టాత్మకంగా కులగణన కూడా చేయనుంది.
ALSO READ | అది ఉగ్రవాదం కాదు.. చట్టబద్దమైన పోరాటం: మరోసారి భారత్పై విషం చిమ్మిన పాక్ ఆర్మీ చీఫ్
2026 జనాభా లెక్కల మొదటి కీలకమైన దశగా గృహ జాబితా కార్యకలాపాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 1, 2026న ఈ ప్రక్రియ మొదలవుతుంది. ఇందులో భాగంగా దేశంలోని ప్రతి నివాస గృహానికి సంబంధించిన కీలక సమాచారం సేకరించనున్నారు. ఇళ్ల నిర్మాణం, తాగునీటి వనరులు, మరుగుదొడ్డి సౌకర్యాలు, వంటకు ఉపయోగించే ఇంధనం, విద్యుత్ వనరులు వంటి గృహ పరిస్థితుల వివరాలు సేకరించనున్నారు. వీటితోపాటు ఫోన్లు, ఇంటర్నెట్, సైకిళ్లు, స్కూటర్లు, కార్లు, టీవీలు వంటి ఆస్తుల గురించిన సమాచారాన్ని కూడా సేకరిస్తారు.
2026 జనాభా లెక్కలను డిజిటల్ పద్ధతిలో నిర్వహిస్తారు. ఇందుకోసం మొబైల్ అప్లికేషన్లను ఉపయోగించనున్నారు. ప్రజలకు తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకునే స్వీయ-గణన (self-enumeration) అవకాశం కూడా కల్పిస్తున్నారు.
లడఖ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి మంచు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో గృహ జాబితా కార్యకలాపాలు అక్టోబర్ 2026లోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ గృహ జాబితా ద్వారా సేకరించిన సమాచారం విధాన రూపకల్పన, అభివృద్ధి కార్యక్రమాలకు చాలా కీలకం.
ప్రాథమిక పనులు..క్షేత్రస్థాయి సిబ్బంది నియామకం
జనాభా లెక్కల మొదటి దశ ప్రారంభించే ముందు సూపర్ వైజరలు, ఎన్యూమరేటర్ల నియామకం, బాధ్యతల పంపిణీ, రాష్ట్ర, జిల్లా పరిపాలనా విభాగాల సహకారం, సమన్వయం వంటి కార్యక్రమాలు చేపడతారు.దేశవ్యాప్తంగా జరిగే ఈ భారీ ప్రక్రియ కోసం ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు, 1.3 లక్షల మంది సెన్సస్ కార్యకర్తలతో సహా 34 లక్షలకు పైగా సిబ్బంది పాల్గొంటారు.