
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిఫ్ మునీర్ మరోసారి భారత్పై విషం చిమ్మాడు. పాక్ పెంచి పోషిస్తోన్న ఉగ్రవాదాన్ని చట్టబద్దమైన పోరాటంగా ఆయన అభివర్ణించాడు. పాక్ అక్రమిత కాశ్మీర్ (పీవోకే)లో మరణించిన ఉగ్రవాదులను ‘అమర వీరులు’ అని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. శనివారం (జూన్ 28) కరాచీలోని పాకిస్తాన్ నావల్ అకాడమీలో జరిగిన ఓ కార్యక్రమానికి మునీర్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత్, పీవోకే అంశాలపై హాట్ కామెంట్స్ చేశారు.
రెచ్చగొట్టకముందే పాకిస్తాన్పై భారత్ రెండు సార్లు దాడి చేసింది. ఇది భారత వ్యూహాత్మక దూరదృష్టి లేకపోవడానికి నిదర్శనమని విమర్శించారు. భారత్ రెచ్చగొట్టిన పాకిస్తాన్ సంయమనం పాటించిందని, ప్రాంతీయ శాంతికి పాక్ తన నిబద్ధతను పునరుద్ఘాటించిందని నీతులు వల్లించారు. ఇకపై మాత్రం భారతదేశం చేసే ఏదైనా దురాక్రమణకు, దాడికి అంతే ధీటుగా బదులిస్తామని హెచ్చరించారు. పాకిస్తాన్ ఉగ్రవాద నిర్మూలనకు చేరువవుతున్న తరుణంలో భారతదేశం ఉద్దేశపూర్వకంగా పాక్లో ఉద్రిక్తతను సృష్టిస్తోందని మునీర్ ఆరోపించారు.
వివాదస్పదమైన కాశ్మీర్ అంశాన్ని మునీర్ మరోసారి లేవనెత్తారు. భారత దేశ అక్రమ ఆక్రమణకు వ్యతిరేకంగా పోరాడుతున్న మన కాశ్మీరీ సోదరుల త్యాగాలను మనం గుర్తుంచుకోవాలని అన్నారు. పాక్ అక్రమిత కాశ్మీర్ (పీవోకే)లో మరణించిన వారు అమర వీరులని అభివర్ణించారు. ఐక్యరాజ్యసమితి తీర్మానాలు, కాశ్మీరీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాశ్మీర్ సమస్యకు న్యాయమైన పరిష్కారం కోసం పాకిస్తాన్ బలమైన న్యాయవాదని పేర్కొన్నారు.
పాకిస్తాన్ను నికర ప్రాంతీయ స్థిరీకరణదారు అని పేర్కొన్న మునీర్.. భారత సైనిక దురాక్రమణకు ఇస్లామాబాద్ గట్టిగా బదులిచ్చిందని అన్నారు. పహల్గాం ఉగ్రదాడికి ముందు కూడా మునీర్ ఇవే తరహా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కాశ్మీర్ పాకిస్థాన్ జీవనాడి అని.. కాశ్మీర్ ఎప్పటికే పాకిస్థాన్లో అంతర్భాగమేనని మునీర్ వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. మునీర్ ఈ వ్యాఖ్యలు చేసిన వారం రోజులకే పహల్గాంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి చేశారు.