ఇరాన్‌‌‌‌‌‌‌‌పై దాడులు నిలిపివేస్తున్నాం: డొనాల్డ్ ట్రంప్

ఇరాన్‌‌‌‌‌‌‌‌పై దాడులు నిలిపివేస్తున్నాం: డొనాల్డ్ ట్రంప్
  • ఇరాన్, ఇతర పశ్చిమాసియా దేశాల విజ్ఞప్తిని అంగీకరించా: ట్రంప్    
  • హార్మూజ్‌‌‌‌‌‌‌‌ను పూర్తిగా తెరవాలి.. అణు ముప్పు తొలగాలని షరతు  
  • అమెరికా దాడులు చేస్తే దీటుగా బదులిస్తామన్న ఇరాన్  

వాషింగ్టన్: ఇరాన్, పశ్చిమాసియాలోని ఇతర దేశాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు, ఇరాన్‌‌‌‌‌‌‌‌పై వారాంతంలో జరగాల్సిన దాడులను రద్దు చేయడానికి అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. అయితే, వేగంగా ఒక ఒప్పందం కుదిరితేనే అమెరికా దాడుల విరామం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం ఉదయం ఆయన ఈ మేరకు తన ట్రూత్ సోషల్‌‌‌‌‌‌‌‌లో ఓ పోస్ట్ పెట్టారు. ఈ ఒప్పందంలో హార్మూజ్ జలసంధిని తక్షణమే, పూర్తిగా తెరవడం, అలాగే ఇరాన్ అణు ముప్పుకు ముగింపు వంటి అంశాలు ఉంటాయని తెలిపారు. ‘‘ఇరాన్, ఇతర పశ్చిమాసియా దేశాల నుంచి మాకు ఒక విజ్ఞప్తి వచ్చింది. ఒక ఒప్పందానికి సంబంధించి ప్రాథమిక మార్గదర్శకాలకు అంగీకరించినందున ఎలాంటి దాడిని జరపవద్దని వారు కోరారు’’ అని ఆయన రాశారు. ‘‘ఈ విజ్ఞప్తి ఆధారంగా, ప్రపంచ భవిష్యత్తు కోసం, అలాగే ఇరాన్ మనుగడ కోసం, త్వరగా ఒక ఒప్పందానికి రాగలగడం అనే షరతుపై దాడులను రద్దు చేయడానికి నేను అంగీకరించాను’’ అని ట్రంప్ పేర్కొన్నారు. షరతులకు అంగీకరించి, డీల్‌‌‌‌‌‌‌‌ కుదుర్చుకోకపోతే.. అమెరికా సంకీర్ణ దళాలు ఇరాన్‌‌‌‌‌‌‌‌పై కనీవిని ఎరుగని స్థాయిలో దాడులు చేపట్టేందుకు పూర్తి సిద్ధంగా ఉన్నాయని ట్రంప్ హెచ్చరించారు. ఐదు నెలలుగా సాగుతున్న యుద్ధానికి తెరదించడానికి ఇరాన్‌‌‌‌‌‌‌‌తో ఒప్పందాన్ని కుదుర్చుకునే నిబద్ధతలో ఇజ్రాయెల్ కూడా అమెరికాతో కలిసి వస్తోందని చెప్పారు. అయితే, ఈ అంశంపై ఇజ్రాయెల్ నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి బహిరంగ ప్రకటన వెలువడలేదు.

దుస్సాహసాలు చేయొద్దు: ఇరాన్ 


అమెరికా బలగాలు కొత్త దాడులకు పాల్పడితే తీవ్రంగా ప్రతిస్పందిస్తామని, ఎలాంటి  దుస్సాహసాలు చేయవద్దని అమెరికాను ఇరాన్ హెచ్చరించింది. శనివారం తుర్కియే, పాకిస్తాన్, సౌదీ అరేబియా ఉన్నతాధికారులతో వేర్వేరుగా ఫోన్ కాల్స్‌‌‌‌‌‌‌‌లో మాట్లాడిన ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఘ్చీ.. ఏవైనా దాడులు జరిగితే ఇరాన్ గట్టిగా బదులిస్తుందని స్పష్టం చేశారు. 

గాజాలో 8 మంది పాలస్తీనీయులు మృతి  

గాజాలో ఆదివారం ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 8 మంది పాలస్తీనీయులు మరణించగా, డజను మందికి పైగా గాయపడ్డారని స్థానిక ఆరోగ్య అధికారులు తెలిపారు. గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో ఇజ్రాయెల్ దాడుల తీవ్రత పెరిగినట్లు వెల్లడించారు. దక్షిణ గాజాలోని ఒక నివాస అపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై జరిగిన దాడిలో 4 సంవత్సరాల చిన్నారితో సహా ముగ్గురు కుటుంబ సభ్యులు మరణించినట్లు మృతదేహాలు చేరిన నాసర్ ఆసుపత్రి తెలిపింది. అలాగే గాజా నగరంలోని మరో నివాస అపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై జరిగిన దాడిలో ఒక బిడ్డతో సహా ముగ్గురు కుటుంబ సభ్యులు మరణించారు.