- కొత్త ఫైనాన్షియల్ ఇయర్లో ఈ‑ఎస్యూవీ
- ఆ తరువాత మరో మూడు మోడల్స్
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం) ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ) తయారీ కోసం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి రెడీ అయ్యింది. కరెంటు బండ్ల డెవెలప్మెంట్ కోసం రాబోయే మూడేళ్లలో రూ.3 వేల కోట్ల నుంచి రూ.5 వేల కోట్ల వరకు ఖర్చు చేస్తామని ప్రకటించింది. రాబోయే ఆర్థిక సంవత్సరంలో తన మొదటి ఈవీ ఎస్యూవీ ‘ఎక్స్యూవీ 400’ను లాంచ్ చేయనుంది. తన పోర్ట్ఫోలియోలో ఈవీల సంఖ్యను పెంచనుంది. మూడు కాన్సెప్ట్ ఈవీ ఎస్యూవీ మోడళ్ల టీజర్ వీడియోలను ఇటీవల రిలీజ్ చేసింది. ఈవీలతోపాటు ఇంటర్నల్ కంబశ్చన్ ఇంజన్ల (ఐసీఈ) కోసం క్యాపిటల్ ఎక్స్పెండించర్ రేషియో 50:50గా ఉంటుందని ఈ విషయంతో సంబంధం ఉన్న కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈవీల తయారీ కోసం మహీంద్రా 2010 లో రేవా ఎలక్ట్రిక్ను కొనుగోలు చేసింది. టాటా మోటార్స్, ఎం&ఎం, ఎంజీ మోటార్, హ్యుందాయ్ మోటార్ వంటి కొన్ని పెద్ద కంపెనీలు కూడా ఈవీ డివిజన్లను ఏర్పాటు చేశాయి. టాటా మోటార్స్ తన ఎలక్ట్రిక్ మొబిలిటీ విభాగానికి.. టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ అని పేరు పెట్టింది. భారతదేశంలో కార్ల ప్లాంట్లను మూసివేస్తామని గత సెప్టెంబర్లో ప్రకటించిన ఫోర్డ్ ఇండియా, ఇప్పుడు ప్రధానంగా ఎగుమతులపై దృష్టి సారించింది. ఈవీలను తయారు చేయడానికి తన ప్లాంట్ను ఉపయోగించాలని భావిస్తోంది. కన్సల్టింగ్ సంస్థ ఎస్బీఎస్ రిపోర్టు ప్రకారం, భారతదేశ ఈవీ మార్కెట్ ఈ దశాబ్దంలో 90 శాతం యాన్యువల్ గ్రోత్ రేటుతో 2030 నాటికి 150 బిలియన్ల డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. 2021 ఫైనాన్షియల్ ఇయర్లో, భారతదేశంలోని మొత్తం వెహికల్ అమ్మకాల్లో ఈవీల వాటా దాదాపు 1.3 శాతం ఉంది.
జిప్జాప్లో మహీంద్రా లాజిస్టిక్స్కు వాటా
థర్డ్-పార్టీ లాజిస్టిక్స్ (3పీఎల్) సొల్యూషన్ ప్రొవైడర్ మహీంద్రా లాజిస్టిక్స్ లిమిటెడ్ (ఎంఎల్ఎల్) లాస్ట్ మైల్ లాజిస్టిక్స్ సర్వీస్ ప్రొవైడర్ అయిన జిప్జాప్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్లో 60 శాతం వాటాను కొన్నది. ఇందుకోసం దాదాపు రూ.72 కోట్లు చెల్లించింది. ప్రైమరీ , సెకండరీ క్యాపిటల్తో డీల్ పూర్తి చేసింది. జిప్జాప్ లాజిస్టిక్స్ 'విజార్డ్' బ్రాండ్ పేరిట పనిచేస్తుంది. ఈ కొనుగోలు వల్ల తమ ఎంఎల్ఎల్ లాస్ట్-మైల్ డెలివరీ వ్యాపారం, డెలివరీ బిజినెస్ ఈడీఈఎల్కు ఎంతో మేలు కలుగుతుందని కంపెనీ తెలిపింది. జిప్జాప్ ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) ఆధారిత డెలివరీ సేవలనూ అందిస్తుంది. టెక్నాలజీ ఆధారిత లాస్ట్ మైల్ సర్వీసులను విస్తరించడం ఎంల్ఎల్ గ్రోత్ స్ట్రాటజీలో భాగమని తెలిపింది. టెక్నాలజీ, జాగ్రఫికల్ కవరేజీ, ఆపరేషన్ సామర్థ్యాలను పెంచడానికి ఈ డీల్ సహాయపడుతుందని ఎంఎల్ఎల్ చెబుతోంది. హైదరాబాద్కు చెందిన విజార్డ్ డిజిటల్ లాస్ట్మైల్ డెలివరీ, డిజిటల్ కామర్స్ కోసం ఇంట్రా-సిటీ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ను నిర్వహిస్తోంది. సంవత్సరానికి 60 మిలియన్ ప్యాకేజీలను డెలివరీ చేస్తోంది. అంకిత్ మధానియా అరుణ్ రావు కలిసి స్థాపించిన విజార్డ్ గత మూడు సంవత్సరాల్లో 10 రెట్ల గ్రోత్ సాధించింది. దాదాపు 3000 పిన్ కోడ్లలో పూర్తి-స్టాక్ డిజిటల్ కెపాసిటీస్, మైక్రో-డిస్ట్రిబ్యూషన్ సెంటర్లతో వినియోగదారులకు సేవలను అందిస్తోంది. ‘‘ఈ అసోసియేషన్ వల్ల ఈ–కామర్స్ ఇతర విభాగాలలో మా కస్టమర్ల సంఖ్య మరింత పెరుగుతుంది. ఇతర సెగ్మెంట్లలోనూ బలపడతాం. విజార్డ్ బృందం డీప్ కేపబిలిటీస్ను నిర్మించింది. ఇప్పటి వరకు బలమైన గ్రోత్ను అందించింది" అని మహీంద్రా లాజిస్టిక్స్ ఎండీ, సీఈఓ రామ్ ప్రవీణ్ స్వామినాథన్ అన్నారు. మహీంద్రా గ్రూప్ మొబిలిటీ సర్వీసెస్ సెక్టార్లో భాగమైన ఎంఎల్ఎల్.. ఆటోమొబైల్, ఇంజనీరింగ్, కన్స్యూమర్ గూడ్స్, ఈ–కామర్స్ వంటి వివిధ పరిశ్రమలలో 400 మందికి పైగా కార్పొరేట్ క్లయింట్లకు సేవలు అందిస్తోంది.