మేజర్ డైరెక్టర్ శశి కిరణ్ తిక్క ఇంటర్వ్యూ

మేజర్ డైరెక్టర్ శశి కిరణ్ తిక్క ఇంటర్వ్యూ

అడివి శేష్ నటించిన ఫస్ట్ పాన్ ఇండియా మూవీ మేజర్.  26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. జూన్ 3న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని మహేష్ బాబు సొంత బ్యానర్ జీఏంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంయుక్తంగా నిర్మించాయి. శుక్రవారం మేజర్ చిత్ర విడుదల నేపథ్యంలో దర్శకుడు శశి కిరణ్ తిక్క ఇంటర్వ్యూ మీ కోసం..

మేజర్ చిత్రం ఎలా మొదలైంది?
అడవి శేష్ వల్లే మొదలైంది. 2010 నుంచి మేం స్నేహితులం. నేను అసిస్టెంట్గా ప్రయత్నిస్తున్న సమయంలో తను హీరోగా ప్రయత్నాలు మొదలు పెట్టాడు. మాటల సందర్భంలో ఓ రోజు మేజర్ నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పాడు. ఆ తర్వాత రెండు కథలు అనుకున్నాం. కానీ కుదరలేదు. ఆఖరికి 2016లో గూఢచారి మొదలు పెట్టాం. అది మంచి విజయం సాధించింది. ఆ తర్వాత ఎవరు సినిమాలు వారివి అనుకుని బ్రేక్ తీసుకున్నాం. నేను వేరే నిర్మాణ సంస్థలోకి  వెళ్ళాను. కొన్నాళ్ళకు శేష్, సహ నిర్మాత శరత్, నమ్రత, సోని సంస్థను ఒక వేదికపై తీసుకువచ్చారు. ఆ తర్వాత నాకు ఫోన్ చేసి సినిమా గురించి చెప్పాడు. చేసేయ్ అన్నా. చేయడంకాదు. ఈ సినిమా నువ్వే డైరెక్ట్ చేయాలన్నాడు. నేను కాస్త బ్రేక్ తీసుకుందామనుకున్నా వినలేదు. దాంతో కొంత సమయం తీసుకున్నాను. ఆ సమయంలో మేజర్ గురించి స్టడీ చేయగా సందీప్ పాత్ర నన్ను బాగా ఆకట్టుకుంది. 26/11 ఎటాక్లో ఎంతో మందిని కాపాడిన వ్యక్తి సందీప్ ఉన్నికృష్ణన్. ఎంతో నాలెడ్జ్ ఉన్న పర్సన్. ఈ విషయం అందరికీ తెలియజేయాలనే నేనే సినిమా చేస్తానని శేష్ తో చెప్పాను. అలా సినిమా మొదలైంది.

శేష్ కెరీర్ గ్రాఫ్లో హీరో, రచయిత, దర్శకుడు వున్నారు కదా. అలాంటప్పుడు మీకు కొన్ని కాన్ఫ్లిక్ట్స్ వుంటాయి కదా?  ప్రీ ప్రొడక్షన్ చేస్తున్న సినిమా పక్కన పెట్టి మేజర్ చేయడానికి కారణం?
నేను బయట సినిమా చేయాలనుకున్నాను కానీ అది ఇంకా ప్రీ ప్రొడక్షన్ దశకు రాలేదు. రైటింగ్ స్టేజీలోనే వుంది. ఇక మేజర్ కథను కేవలం సందీప్ తల్లిదండ్రుల కోసమే చేశాను. సందీప్ గురించి సీబీఎస్సీ టెక్ట్ బుక్స్లో ఒక చాప్టర్ ఉంది. అందుకే  ఒళ్ళు దగ్గరపెట్టుకుని సినిమా చేయాలనుకున్నా.
 
ఈ కథ పై చాలాకాలం శేష్ తో ట్రావెల్ అయ్యారు కదా? మీకు ఫ్రీడం  దక్కిందా?
ఈ సినిమా కూడా ఓ బేబీలా జాగ్రత్తగా చేశాం. అతను గతంలో దర్శకుడు కావచ్చు. కానీ ఈ సినిమాకు నటుడు మాత్రమే. అందుకే శేష్ తో గూఢచారి, ఇప్పుడు మేజర్ చేశాను. ప్రతి నటుడు ఎక్కడో ఒక చోట నిర్ణయం తీసుకోవాలి. అది మేజర్ కోసం శేష్ తీసుకున్నాడు.
 
ఇలాంటి కథకు డ్రామా వుంటుంది. అబ్బూరి రవి డైలాగ్స్ ఏ మేరకు రీచ్ అయ్యాయి అనుకుంటున్నారు?
నాకు అబ్బూరి రవి బ్యాక్ బోన్ లాంటివారు. నాతోపాటు కథా చర్చల్లో పాల్గొన్నారు. కథ, డైలాగ్స్లో ఆయన పేరు ఉంటుంది. హిందీ, తెలుగు ఒకేసారి చేశాం. తెలుగు డైలాగ్లు ఆయన రాస్తే.. హిందీ డైలాగ్లు అచ్చుత్ రాశారు. కొన్ని పదాలు కొత్తగా అనిపిస్తే తెలుగులో వాటికి అనుగుణంగా మెరుగులు దిద్దాం. ఇందులో మాటలు చాలా సహజంగా నీట్గా ఉన్నాయి. వైజాగ్లో సినిమా చూస్తూ ఆడియన్స్ డైలాగ్స్కు విజిల్స్ వేస్తున్నారు. ఆ రియాక్షన్ అన్ని చోట్లా ఉంటుందనుకుంటున్నాను.

26/11లో 17 మంది అధికారులు చనిపోయారు. అందులో కేవలం సందీప్ కథనే ఎందుకు ఎంపిక చేసుకున్నారు?
ఫ్రీడం ఫైటర్స్ చాలా మంది వుంటారు. కానీ ఒక్కరి ఎఫెక్ట్ మాత్రమే అందరిపై పడుతుంది. అలాగని మిగిలినవారు తక్కువని కాదు. వారి గురించి కూడా కథలు రావచ్చు. శేష్.. సందీప్ పాత్రకు బాగా కనెక్ట్ అయ్యాడు. మిగిలిన ఆఫీసర్ల గురించి ముందు ముందు ఫిలింమేకర్స్ చేయవచ్చు. ఇక్కడ ఎవరూ తక్కువ కాదు.

సందీప్ ఉన్నికృష్ణన్ కుటుంబ సినిమా చూశారా?
బెంగుళూరులో చూశారు. మూడేళ్ళుగా మేం వారిని సంప్రదిస్తూనే వున్నాం. షూట్లో మేజర్ రియాక్షన్ ఫలానా సన్నివేశంలో ఎలా వుంటుందో అని అడిగి మరి చేసేవాళ్ళం. సందీప్ తల్లి సూచనలు చేసేవారు. ఇంత ఔట్పుట్ తీసుకున్న వీరు సినిమా ఎలా తీశారనే ఆసక్తి వారికి వుంటుంది. కానీ వాళ్లు సినిమా చూడగానే మెచ్చుకున్నారు.

సందీప్ భార్య గురించి సినిమాలో ప్రస్తావించారా?
ఆమె గురించి ఆ తర్వాత విషయాలు ఏవీ చూపించలేదు.

సందీప్ గురించి తెలుసుకునేటప్పుడు  ఎమోషనల్ అయిన సందర్భాలున్నాయా?
మేజర్ తల్లిదండ్రులతో చర్చలో పాల్గొన్నప్పుడు నేను చాలా సందర్భాల్లో ఇన్స్పైర్ అయ్యాను. రియల్ లైఫ్లో ఆహ్లాదకరంగానూ, బాధలు, ఏడుపులు ఇవన్నీ ఆయనలో వున్నాయి. మేం కూడా విన్నాక ఫీల్ అయ్యాం. ఈ ఫీలింగ్ను యధాతధంగా నటీనటులు ఫీలయ్యేలా చేశాం. అవి తెరపై వచ్చేలా చూశాం. ప్రకాష్ రాజ్, రేవతి పాత్రలు చూస్తే మీకే అర్థమవుతుంది. 
 
గూఢచారి కంటే మేజర్ బడ్జెట్ పరంగా ఎక్కువ కదా. ఛాలెంజ్ అనిపించిందా?
గూఢచారి సినిమా నేచురల్ లొకేషన్లో చేశాం. కానీ మేజర్ స్టార్ హోటల్లో చూపించాలి. 1990 నాటి హోటల్స్. అందుకే హైదరాబాద్లోని చాలా హోటల్స్ లో చేశాం. రామోజీ ఫిలిం సిటీలో ఏడు సెట్లు వేశాం.

సినిమా లిబర్టీని ఎంత వరకు తీసుకున్నారు?
సినిమాపరంగా కొన్ని తీసుకున్నాం. యాక్షన్ చాలా జాగ్రత్తగా చేయాల్సి వచ్చింది. అహ్మదాబాద్, లక్నో వంటి చోట్ల యాక్షన్ తీశాం.

తాజ్ హోటల్లో షూట్ చేశారా?
అక్కడ పర్మిషన్ ఇవ్వరు. అందుకే తాజ్ హోటల్లోని బ్లాక్ లాగా కొన్ని సెట్లు వేసి తీశాం. కోవిడ్ వల్ల కొంచెం ఆలస్యమైంది.

ముందుగానే సినిమా అందరికీ చూపించాలనే ఆలోచన ఎవరిది?
మార్కెటింగ్ డిపార్ట్మెంట్, శరత్, శేష్ డిసైడ్ చేశారు. పైరసీ చేస్తారేమోనన్న డౌట్ కూడా వచ్చింది. అందుకే ఫోన్లు ముందుగానే తీసేసుకున్నాం.

బయట ఈ సినిమాకు అంత బజ్ ఎందుకు రాలేదు?
సోషల్ మీడియాలో తగినంత బజ్ వచ్చింది. మలయాళంలో షో వేయలేదు. అక్కడ పైరసీ ప్రాబ్లమ్ ఎక్కువ.
 
 పాన్ ఇండియా మూవీ కొలమానాలు ఏమిటి?
ఫిలిం మేకర్ ఎవరైనా తమ సినిమా అందరూ చూడాలనే కోరుకుంటాడు. గోవా ఫిలిం పెస్టివల్ లోనూ తన సినిమాను అందరూ చూడాలని మేకర్ కు ఉంటుంది. కథలు యూనివర్శల్. అందుకే పాన్ ఇండియా సినిమాగా మారిపోయాయి. అది నిర్మాతను బట్టి ఉంటుంది.

కెరీర్ మొదట్లోనే బయోపిక్ చేయడం కష్టం అనిపించిందా?
మేజర్ చేయాలనే చేశాను. గూఢచారి అనేది ఫిక్షన్ అది ఎలాగైనా చేయవచ్చు. మేజర్కు మాత్రం పరిమితులు వుంటాయి. అలానే చేయాలి. 31 ఏళ్ల మేజర్తో పాటు ఆయన చుట్టు పక్కలవారి జర్నీ కూడా చూపించాలి.

మేజర్ను మహేష్ బాబు చూసారా?
ట్రైలర్ రిలీజ్కు ముందు రోజు సినిమా చూశారు. 5 నిముషాలు ఏమీ మాట్లాడలేదు. బాగుందో లేదో అనే అనుమానం వచ్చింది. కానీ వెంటనే శేష్ ను హగ్ చేసుకొని అభినందించారు.

మిగతా నటీనటులు గురించి చెప్పండి?
రేవతి నా ఫేవరేట్ నటి. మానిటర్లో చూసినప్పుడే ఏడుపు వచ్చింది. అంతలా పాత్రను పండించారు. ప్రకాష్ రాజ్కు నాతో రెండో సినిమా. ఇలాంటి సినిమాకు కొన్ని పరిమితులుంటాయి. అలానే చేశారు. అలాగే సాయిమంజ్రేకర్, శోభితా కూడా బాగా నటించారు.  

మీ తదుపరి చిత్రాల గురించి చెప్పండి?
రెండు కథలున్నాయి. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో చేయాలి. త్వరలో వివరాలు చెబుతాను.