- టెర్రరిస్టులను పంపించి..పాక్ భయపెట్టాలని చూస్తోంది
- చాలా ప్రాంతాల్లో ఆంక్షలు ఎత్తేశాం
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్లోని ఆర్టికల్ 370 రద్దును స్థానికులు సపోర్ట్ చేస్తున్నారని నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ చెప్పారు. ఇన్ని రోజులు ఆ ఆర్టికల్ను వాళ్లు స్పెషల్ స్టేటస్గా భావించలేదని, ‘స్పెషల్ డిస్క్రిమినేషన్’గా భావించారని అన్నారు. ఢిల్లీలో శనివారం ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో దోవల్ మాట్లాడారు. కాశ్మీర్లోకి టెర్రరిస్టులను పంపేందుకు పాక్ ప్రయత్నిస్తోందని, అందుకే ఆంక్షలు విధించి, సెక్యూరిటీని పెంచామన్నారు. కాశ్మీర్ లోయలోని 199 పోలీస్ స్టేషన్లకు గాను కేవలం10 స్టేషన్ల పరిధిలో మాత్రమే ఆంక్షలు ఉన్నాయని చెప్పారు. 100 శాతం టెలిఫోన్ సర్వీసులను పునరుద్ధరించారన్నారు.
ఇంటిపై ఎటాక్
జమ్మూకాశ్మీర్ సోపోర్ జిల్లాలోని పండ్ల వ్యాపారి ఇంటిపై మిలిటెంట్లు శనివారం ఎటాక్ చేశారు. ఈ ఘటనలో ఇంట్లోని నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిలో రెండేళ్ల చిన్నారి ఉందని, పరిస్థితి విషమించటంతో ఢిల్లీ ఎయిమ్స్కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు అధికారులు చెప్పారు.
దోవల్ ఇంకా ఏమన్నారంటే
- పాకిస్తాన్ పద్ధతిలో మార్పును బట్టి ఆంక్షలు తొలగిస్తాం. టెర్రరిస్టులను కాశ్మీర్లోకి పంపడం ఆపేసిన వెంటనే ఆంక్షలు ఎత్తేస్తాం.
- పాకిస్తాన్ టెర్రరిస్టుల నుంచి కాశ్మీర్ ప్రజలను కాపాడేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. అశాంతి సృష్టించేందుకు పాకిస్తాన్కు టెర్రరిజమ్ ఒక్కటే సాధనం. ఇంతవరకు 230 మంది టెర్రరిస్టులను గుర్తించాం. కొంత మందిని అరెస్టు చేశాం.
- లోకల్ పోలీసులు, సెంట్రల్ ఫోర్స్ మాత్రమే సెక్యూరిటీని హ్యాండిల్ చేస్తుంది. ఆర్మీ కేవలం టెర్రరిస్టులకు వ్యతిరేకంగా పోరాడేందుకే ఉంది. ఆర్మీ జోక్యం ఉందనే వాదనలు నిజం కాదు.
- ఆర్టికల్ 370 రద్దు వల్ల జమ్మూకాశ్మీర్ ప్రజలకు చాలా అవకాశాలు వచ్చాయి. ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఆర్థికాభివృద్ధి ఉంటుంది.

