ఓయూ, వెలుగు: రిజర్వేషన్ల రోస్టర్ విధానంలో మాల విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయంపై అక్టోబర్ మొదటి వారంలో ఓయూలో ‘మాల విద్యార్థి నిరుద్యోగుల రణభేరి’ పేరుతో రాష్ట్రస్థాయి మహాసభ నిర్వహించనున్నట్లు మాల స్టూడెంట్ జేఏసీ, అంసా, ఐక్య విద్యార్థి సంఘాల ప్రతినిధులు తెలిపారు. ఆదివారం ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద నిర్వహించిన రాష్ట్రస్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ఇటీవల వెలువడిన 25 ఉద్యోగ నోటిఫికేషన్లలో రోస్టర్ విధానం కారణంగా మాలలకు తీవ్ర అన్యాయం జరిగిందని ప్రతినిధులు ఆరోపించారు. సుమారు 19 నోటిఫికేషన్లలో మాలలకు ఒక్క పోస్టు కూడా దక్కలేదని పేర్కొన్నారు. సమస్య పరిష్కారం కోసం ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. స్టూడెంట్ జేఏసీ చైర్మన్ మాదాసు రాహుల్, నామ సైదులు, భానుతేజ, మద్దెల రాజు, చిక్కుడు వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
