- లాక్డౌన్తో ఆటోను మధ్యలోనే ఆపేసిన పోలీసులు
- వేరే మార్గంలేక భుజాలపై తండ్రిని మోసుకెళ్లిన కొడుకు
- కేరళలోని పునలూర్లో ఘటన
కొల్లాం: అనారోగ్యంతో ఉన్న తండ్రిని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకెళుతుండగా పోలీసులు ఆటోను ఆపేయడంతో ఓ వ్యక్తి భుజాలపైనే తండ్రిని మోసుకుంటూ వెళ్లాడు. తండ్రి బరువును మోయలేక ఇబ్బందులు పడుతూనే మండుటెండ, ట్రాఫిక్జామ్లో ఒక కిలోమీటర్ దూరం నడిచి తీసుకెళ్లాడు. అతని వెనకే ఓ మహిళ హాస్పిటల్ డాక్యుమెంట్స్, ప్రిస్క్రిప్షన్, ఇతర వస్తువులు పట్టుకుని పరుగెత్తింది. కేరళ కొల్లాం జిల్లా పునలూర్లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కేరళ రాష్ట్ర హ్యూమన్ రైట్స్ కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసింది.
లాక్డౌన్ కారణంగా..
పునలూర్లోని కులతుపుజకు చెందిన 65 ఏండ్ల వ్యక్తిని పునలూర్ తాలూకా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. తండ్రిని ఇంటికి తీసుకెళ్లేందుకు అతని కొడుకు ఆస్పత్రికి ఒక ఆటోను తీసుకెళ్లాడు. వారు ఇంటికి బయలుదేరగా మధ్యలో పోలీసులు అడ్డుకున్నారు. లాక్డౌన్ గైడ్లైన్స్కు వ్యతిరేకంగా ఆటో నడపరాదని చెప్పారు. తండ్రి ఆస్పత్రి డాక్యుమెంట్లు చూపించినా ఆటోను పోలీసులు వదల్లేదు. తమ ఇంటికి కిలోమీటర్ దూరం ఉందనగా పోలీసులు ఆపేయడంతో వేరే గత్యంతరం లేక అతడు షర్ట్ కూడా వేసుకోకుండా ఉన్న తండ్రిని భుజాలపై మోసుకుంటూ ట్రాఫిక్ జామ్లో నడుచుకుంటూ వెళ్లాడు. హాస్పిటల్ డాక్యుమెంట్లను చూపినా పోలీసులు తమ ఆటోను అనుమతించలేదని అతడు ఆరోపించాడు. ఆటోను ఆపినప్పుడు అందులో పేషెంట్ లేడని, ఆటోను ఆపిన తర్వాతే అతడు వెహికల్ దిగి 200 మీటర్ల దూరంలో ఉన్న హాస్పిటల్కు వెళ్లి.. వచ్చేటప్పుడు తన తండ్రిని భుజాలపై తీసుకుని వచ్చాడని పోలీసులు చెప్పారు. కాగా, తండ్రిని భుజాలపై మోసుకుని వెళుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఈ ఘటనపై కేరళ రాష్ట్ర హ్యూమన్ రైట్స్ కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసింది.