- తీవ్ర గాయాలతో ఆస్పత్రిపాలైన బాధితుడు
- హైదరాబాద్ మల్లాపూర్లో దారుణం
- ఇద్దరు యువకుల అరెస్ట్
మల్కాజిగిరి, వెలుగు: హైదరాబాద్మల్లాపూర్లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ వ్యక్తిని ఇద్దరు యువకులు బొలెరో కారుతో ఢీకొట్టి కిలోమీటర్ దూరం ఈడ్చుకెళ్లారు. ఈ నెల 9న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. రాంపల్లికి చెందిన సతీశ్ కుమార్(45) సిటీలో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నెల 9న రాత్రి పానుగంటి రాజు అనే వ్యక్తితో కలిసి కారులో మల్లాపూర్ నుంచి రాంపల్లికి బయలు దేరారు.
మల్లాపూర్ ఎక్స్ రోడ్ వద్ద గవర్నమెంట్స్టిక్కర్తో కూడిన ఒక బొలెరో వాహనం వీరి కారును ఢీకొట్టి సైరన్వేసుకుంటూ ఆగకుండా వెళ్లిపోయింది. దీంతో బాధితులు బొలెరో కారును వెంబడిస్తూ హెచ్బీ కాలనీ ఎన్టీఆర్ విగ్రహం వద్ద అడ్డుకున్నారు. అనంతరం సతీశ్ కారు దిగి వారిని ప్రశ్నిస్తుండగానే ఆకతాయిలు బొలెరోతో మళ్లీ ఢీకొట్టారు. దీంతో బానెట్పై పడిపోయిన సతీశ్ను అలాగే కిలోమీటర్ వరకు ఈడ్చుకొని వెళ్లారు. కారు నెంబర్ ప్లేట్ బంపర్ను పట్టుకొని ఉన్న బాధితుడు కాసేపటికి కిందపడగా, కారు వెనుక టైరు అతడి మీది నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనలో సతీశ్ కుమార్కు తీవ్ర గాయాలు కాగా, ఆసుపత్రికి తరలించారు. రాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను సంతోష్నగర్కు చెందిన ఉప్పరి మహేశ్(23), బాలాజీనగర్కు చెందిన అరగండ్ల తరుణ్(22)గా గుర్తించి అరెస్ట్ చేశారు. వీరిని శనివారం రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. వారిని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.
