జగిత్యాల జిల్లా ఎర్ధండిలో ఘటన
పాత కక్షలే కారణమంటున్న పోలీసులు
ఇబ్రహీంపట్నం, వెలుగు:పాత కక్షల నేపథ్యంలో కన్న కూతురు కళ్ల ముందే ఓ తండ్రి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్ధండిలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. మెట్పల్లి డీఎస్పీ గౌస్బాబా వివరాల ప్రకారం గ్రామానికి చెందిన బర్లపాటి రాజేశ్వర్, పల్లె పోశెట్టికి 2017లో ఓ విషయంలో గొడవ జరిగింది. ఒకరిపై ఒకరు స్థానిక పీఎస్లో కేసులు పెట్టుకున్నారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. కొన్నాళ్ల తర్వాత రాజేశ్వర్గల్ఫ్దేశాలకు వెళ్లి కొద్ది రోజుల క్రితమే ఊరికి వచ్చాడు. జరిగిందేదో జరిగిపోయింది. కేసులు విత్డ్రా చేసుకుందామని రాజేశ్వర్ సిద్ధమయ్యాడు. పోశెట్టి అందుకు నిరాకరించాడు. ఊర్లో వీరికి పక్కపక్కనే పొలాలు ఉండటంతో దారి విషయంలోనూ మళ్లీ గొడవ జరిగింది. ఈ క్రమంలో బుధవారం రాత్రి గ్రామంలోని వైన్ షాపు వద్ద ఇద్దరూ మందు తాగుతున్నప్పుడు మాటామాటా పెరిగింది. ఇద్దరూ గొడవకు దిగారు. పోశెట్టి కోపంలో కూతురు చూస్తుండగా రాజేశ్వర్ను కత్తితో పొడిచాడు. కడుపు, మొఖంపై తీవ్ర గాయాలయ్యాయి. హాస్పిటల్కు తీసుకెళ్తుండగా చనిపోయాడు. మృతుడి భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. రాజేశ్వర్కు భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.
కఠినంగా శిక్షించాలి: గ్రామస్తులు
పోశెట్టిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఇబ్రహీంపట్నం పీఎస్ముందు ఎర్ధండి గ్రామస్తులు గురువారం ఆందోళనకు దిగారు. నిందితుడిని తమకు అప్పజెప్పాలని డిమాండ్చేశారు. పోశెట్టి వల్ల తమకు ప్రాణ హాని ఉందని ఆరోపించారు. ఈ సంఘటనతో అంతా భయబ్రాంతులకు లోనయ్యారని చెప్పారు. మెట్పల్లి డీఎస్పీ గౌస్బాబా, సీఐ శ్రీనివాస్, ఎస్సై వెంకట్రావు సముదాయించే ప్రయత్నించగా మృతుని కూతుళ్లు డీఎస్పీ, సీఐ కాళ్లపై పడి రోధించారు. తమ తండ్రిని చంపిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని కోరారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకునేలా చూస్తామని డీఎస్పీ హమీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.