మల్కాజ్గిరి, వెలుగు: హైదరాబాద్ నేరేడ్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. లోన్ యాప్ వేధింపుల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడిందా? లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసుల వివరాల ప్రకారం..
ఏపీలోని కృష్ణా జిల్లా గణపవరం గ్రామానికి చెందిన శివదానపు దేవనందిని(25) వెస్ట్ గోదావరి జిల్లా ద్వారకాతిరుమలకు చెందిన తిరుమల రేవంత్కుమార్ను 2022లో ప్రేమ వివాహం చేసుకుంది. వివాహానంతరం దంపతులు నేరేడ్మెట్ పరిధి జేజే నగర్లోని ఓ అపార్ట్మెంట్లో నివాసముంటూ ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు. శనివారం ఉదయం రేవంత్కుమార్ పనిమీద బయటకు వెళ్లి వచ్చి చూసేసరికి బెడ్రూమ్లో ఫ్యాన్కు ఉరివేసుకుని కనిపించింది.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతురాలి మొబైల్ఫోన్ను పరిశీలించగా, ఓ లోన్ యాప్ ద్వారా రుణం తీసుకున్నట్లు గుర్తించారు. రుణ చెల్లింపులో ఆలస్యం కావడంతో నిర్వాహకులు పదేపదే ఫోన్ చేసి వేధింపులకు గురిచేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ వేధింపులను తట్టుకోలేక ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతురాలి తండ్రి వెంకటరెడ్డి అల్లుడిపై అనుమానాలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.
