పేలిన పటాకు.. స్క్రాప్ గోదాంలో మంటలు

పేలిన పటాకు.. స్క్రాప్ గోదాంలో మంటలు

శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎరకలగడ్డ ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పిల్లలు బాణసంచా పేలుస్తుండగా ప్రమాదవశాత్తు ఒక పటాకు వెళ్లి స్క్రాప్ గోదాంలో పడడంతో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటన శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎరకలగడ్డ ప్రాంతంలో ఇవాళ కొంతమంది చిన్నపిల్లలు టపాసులు పేలుస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఒక టపాసు వెళ్లి గౌస్ అనే వ్యక్తికి చెందిన  స్క్రాప్ గోదాంలో పడింది. దాంతో పెద్ద ఎత్తున మంటలు చేరేగాయి.

గమనించిన స్థానికులు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీసులతోపాటు ఫైర్ సిబ్బందికి సమాచారం అందజేశారు.  సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. ఎరుకల గడ్డలో నిబంధనలకు విరుద్ధంగా ఇళ్ల మధ్యలో పరిశ్రమలు ఏర్పాటు చేయడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇళ్ల మధ్యలో ఏర్పాటు చేసిన గోదాములను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.