సెంచరీతో చెలరేగిన మయాంక్ .. రాజస్థాన్ కు భారీ టార్గెట్

సెంచరీతో చెలరేగిన మయాంక్ .. రాజస్థాన్ కు భారీ టార్గెట్

షార్జా: ఐపీఎల్‌-13లో భాగంగా రాజస్థాన్‌ రాయల్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ ఓపెనర్లు వీర బాదుడు బాదారు. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 223 రన్స్ చేసి.. ఈ సీజన్ లో ఇప్పటివరకు అత్యధిక స్కోర్ చేసిన టీమ్ గా టాప్ ప్లేస్ లో నిలిచింది. వరుస సిక్సర్లు, బౌండరీలతో ఓపెనర్లు చెలరేగి ఆడారు. మెరుపు సెంచరీతో మయాంక్ మాయాజాలం చేయగా.. ఆచితూచి ఆడుతూ రాహుల్ హాఫ్ సెంచరీతో కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా  60 రన్స్ చేసి, ఈ సీజన్ లో రికార్డుకెక్కిన పంజాబ్.. ఈ సీజన్ లో వికెట్ నష్టపోకుండా అత్యధిక పరుగులు(183) చేసిన ఓపెనింగ్ జోడీగా మరో స్థానం సంపాదించింది.

వికెట్ తీయడానికి రాజస్థాన్ లోని ఆరుగురు బౌలర్లు కష్టపడ్డారు. చివరకు 17వ ఓవర్ లో టామ్ కుర్రాన్ బౌలింగ్ లో సంజు శాంసన్ కు క్యాచ్ ఇచ్చి వెను తిరిగాడు మయాంక్ అగర్వాల్(106-7 సిక్సర్లు, 10 ఫోర్లు). మొత్తానికి పంజాబ్ టోటల్ స్కోర్ 183/1 దగ్గర ఒక్క వికెట్ దక్కింది రాజస్థాన్ కు. వెంటనే రాహుల్ (69) కూడా ఔట్ అయ్యాడు. తర్వాత వచ్చిన మాక్స్ వెల్, నికోలస్ పూరన్ కూడా రెచ్చిపోవడంతో కింగ్స్ ఎలెవన్ ఈజీగా 200 మార్క్ దాటింది.

పంజాబ్ ప్లేయర్లలో .. మయాంక్(106), రాహుల్(69), మాక్స్ వెల్(13), పూరణ్(25) రన్స్ చేశారు.

రాజస్థాన్ బౌలర్లలో.. టామ్ కుర్రాన్, అంకిత్ రాజ్ పుత్ కు చెరో వికెట్ దక్కింది.

మయాంక్ మాయాజాలం..

మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌ ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ విధ్వంసకర ఇన్నింగ్స్ ‌తో అలరించాడు.  ఐపీఎల్‌ అంటే ఇది కదా అనేంతగా రెచ్చిపోయి ఆడాడు. రాజస్తాన్ ‌కు చుక్కలు చూపిస్తూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. బౌండరీల మోత మోగించి తన ఐపీఎల్‌ కెరీర్‌ లో తొలి సెంచరీ సాధించాడు. 26 బాల్స్ లోనే హాఫ్‌ సెంచరీ సాధించిన మయాంక్‌.. మరో 19 బాల్స్ లోనే దాన్ని సెంచరీగా మలుచుకున్నాడు. 45 బాల్స్ లో  9 ఫోర్లు, 7 సిక్స్‌లతో సూపర్ సెంచరీ సాధించి అరుదైన జాబితాలో స్థానం సంపాదించాడు. ఐపీఎల్‌ లో ఫాస్టెస్ట్‌ సెంచరీ సాధించిన రెండో భారత ఆటగాడిగా మయాంక్‌ నిలిచాడు.