ఆర్టీసీ బస్సు టైర్లు ఊడిన ఘటన- విచారణకు ఎండీ సజ్జనార్ ఆదేశం

ఆర్టీసీ బస్సు టైర్లు ఊడిన ఘటన- విచారణకు ఎండీ సజ్జనార్ ఆదేశం

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో టైర్లు ఊడిపోయిన ఆర్టీసీ అద్దె బస్సు ప్రమాద ఘటనపై ఆ సంస్థ ఎండీ సజ్జనార్ విచారణకు ఆదేశించారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ డిపోకు చెందిన పల్లె వెలుగు అద్దె బస్సు ఆదివారం (డిసెంబర్ 24న) మధ్యాహ్నం ప్రమాదానికి గురైంది. హుజూరాబాద్‌ - హన్మకొండ రూట్​లో వెళ్తున్న TS 02 UC 5936 నెంబర్‌ గల బస్సు ఎల్కతుర్తి సమీపంలోకి రాగానే వెనుక ఎడమ వైపున్న రెండు టైర్లు ఒక్కసారిగా ఊడిపోయాయని, ఈ ప్రమాదంలో బస్సు కొద్దిగా డ్యామేజ్‌ అయిందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చెప్పారు. 

ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నారని సజ్జనార్ తెలిపారు. అద్దె బస్సు డ్రైవర్‌ రాజు అప్రమత్తమై బస్సును వెంటనే ఆపడం వల్ల ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదన్నారు. బస్సు ప్రమాద ఘటనపై వెంటనే ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్‌ విచారణకు ఆదేశించారు. పూర్తి వివరాలతో సమగ్ర నివేదికను అందజేయాలని అధికారులకు ఆదేశించారు. 

హుజూరాబాద్‌ డిపోకు చెందిన అద్దె పల్లె వెలుగు బస్సు ఓవర్‌ లోడింగ్‌ వల్లే ప్రమాదానికి గురైనట్లు వస్తోన్న వార్తలు పూర్తి అవాస్తవం అని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చెప్పారు. ప్రమాద సమయంలో బస్సు 40 కిలోమీటర్ల వేగంతో వెళ్తోందని, అప్పుడు బస్సుల్లో 42 మంది ప్రయాణికులు ఉన్నారని తెలిపారు. ప్రమాదం జరగగానే బస్సులోని 42 మందిని సురక్షితంగా మరొక బస్సులో ఆర్టీసీ అధికారులు పంపించారన్నారు.

ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని సజ్జనార్ స్పష్టం చేశారు. ప్రమాద సమయంలో 80 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నట్లు జరుగున్న ప్రచారం అవాస్తవం అన్నారు. అద్దె బస్సు ప్రమాదంపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలను తీసుకోవాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. అద్దె బస్సుల నిర్వహణ విషయంలో వాటి యజమానులు అప్రమత్తంగా ఉండాలని, తరచూ తనిఖీలు చేస్తూ తమ బస్సులను ఎప్పుడూ ఫిట్​గా ఉంచుకోవాలని సూచించారు. బస్సుల నిర్వహణ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ప్రమాదాలు సంభవిస్తాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హెచ్చరించారు.