బషీర్బాగ్, వెలుగు: దేశవ్యాప్తంగా ఉన్న 12 లక్షల మెడికల్ షాప్ల నిర్వాహకులు తమ హక్కుల సాధన, ఉనికి, భవిష్యత్ కోసం రేపు(మే 20న) ఒక రోజు సమ్మెకు దిగనున్నారు. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్, డ్రగ్గిస్ట్స్ పిలుపు మేరకు తలపెట్టిన ఈ దేశవ్యాప్త బంద్పై సోమవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో తెలంగాణ చాంబర్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్, హైదరాబాద్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులు వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు.
హైదరాబాద్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆరుగొండ శ్రీధర్ గుప్త, గౌరవ అధ్యక్షుడు వెంకటరమణ రెడ్డి మాట్లాడుతూ.. ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా కేవలం డిస్కౌంట్ల పేరుతో కొన్ని కార్పొరేట్ కంపెనీలు ప్రజా ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నాయన్నారు. నార్కోటిక్, హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ ఆన్లైన్లో సులభంగా లభ్యం కావడం వల్ల యువత మత్తుకు బానిస అవుతున్నారని వాపోయారు.
ప్రభుత్వం ‘డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ’ కోసం ఒకవైపు కృషి చేస్తుంటే, ఆన్లైన్ విక్రయాలు దానికి గొడ్డలిపెట్టుగా మారాయని, అందుకే ప్రజా ఆరోగ్య రక్షణ కోసం తాము ఈ బంద్లో పాల్గొంటున్నామని స్పష్టం చేశారు. తెలంగాణ చాంబర్ అధ్యక్షుడు గీసులాల్ జైన్, ట్రెజరర్ ఆనంద్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ఆన్లైన్లో మందుల అక్రమ అమ్మకాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. బంద్ సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. బంద్ రోజున ఎమర్జెన్సీ మెడిసిన్ అవసరం ఉన్నవాళ్లు 7569359595, 9281094907 ఫోన్ నంబర్లకు సంప్రదిస్తే వారికి మందులు అందజేస్తామన్నారు.
