- పారాసిటమాల్, ఎజిత్రోమైసిన్ రేట్లు పెరుగుతున్నయ్
- 10 శాతం పెంపునకు ఓకే
- 850 మెడిసిన్స్ రేట్లు పెరుగుతాయి
- ఎన్పీపీఏ నోటిఫికేషన్
వెలుగు, బిజినెస్ డెస్క్: పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, కూరగాయలు, ఫుడ్ ప్రొడక్ట్స్ రేట్ల పెరుగుదలతో ఇప్పటికే సతమతమవుతున్న ప్రజలపై మెడిసిన్స్ రూపంలో ఇప్పుడు మరో భారం పడనుంది. వచ్చే నెల 1 వ తేదీ నుంచి పారాసిట్మాల్, ఎజిత్రోమైసిన్ వంటి ఎసెన్షియల్ మెడిసిన్స్ రేట్లు పెరగనున్నాయి. ఎసెన్షియల్ మెడిసిన్స్ లిస్టులోని 850 మెడిసిన్స్ రేట్లను 10 శాతం పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇస్తోంది. టోకు రేట్ల సూచీ (హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్) ఆధారంగా ప్రతీ ఏడాదిలాగే మెడిసిన్స్ రేట్లను పెంచనున్నారు. దేశంలో మెడిసిన్స్ రేట్లను నియంత్రించే నేషనల్ ఫార్మాస్యూటికల్స్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ) ఈ రేట్ల పెరుగుదల విషయం వెల్లడించింది. 2021 లో టోకు రేట్ల సూచీ పెరుగుదల 10.8 శాతంగా ఉంది. జనం ఎక్కువగా వాడే పెయిన్ కిల్లర్లు, యాంటి–ఇన్ఫెక్టివ్స్, కార్డియాక్, యాంటి బయాటిక్స్ వంటి చాలా మెడిసిన్స్ ఈ ఎసెన్షియల్ మెడిసిన్స్ లిస్టులో ఉన్నాయి. షెడ్యూల్డ్ డ్రగ్స్ జాబితాలోని ఈ మెడిసిన్స్ రేట్లు 10 శాతం పెరగడం ఇదే మొదటిసారి అవుతుంది. నాన్–షెడ్యూల్డ్ డ్రగ్స్ రేట్లు మాత్రమే ఈ స్థాయిలో పెంచుకోవడానికి సాధారణంగా అనుమతి ఇస్తున్నారు.
గత కొన్నేళ్ల డేటా చూస్తే టోకు రేట్ల సూచీ ప్రకారం ఏటా పెరుగుదల 1–2 శాతం మధ్యనే ఉంటోంది. ఉదాహరణకు 2019 లో ఎసెన్షియల్ మెడిసిన్స్ రేట్లను 2 శాతం పెంచుకోవడానికి ఎన్పీపీఏ అనుమతి ఇచ్చింది. ఇక 2020 లోనైతే ఈ రేట్లు 0.5 శాతమే పెంచారు. రాబోయే కొన్ని రోజులలో షెడ్యూల్డ్ ఫార్ములేషన్స్ సీలింగ్ రేట్లను ఎన్పీపీఏ ప్రకటించనుంది.
ఫార్మా ఇండస్ట్రీకి సంతోషమే....
బల్క్ డ్రగ్స్ రేట్ల పెరుగుదలతోపాటు, ఇతర ఖర్చులూ పెరిగి ఇబ్బందులెదుర్కొంటున్న ఫార్మా ఇండస్ట్రీకి మాత్రం ఇది గుడ్న్యూసే. కరోనా టైములో యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్గ్రీడియెంట్స్ (ఏపీఐ), రవాణా, ప్లాస్టిక్స్, ఇతర ప్యాకేజింగ్ మెటీరియల్స్ వంటి వాటి ఖర్చులు భారీగా పెరిగాయి. దీంతో ఫార్మా ఇండస్ట్రీ చిక్కుల్లో పడింది. కొత్త రేట్ల ప్రకటన వెలువడితే పరిశ్రమ కష్టాల నుంచి బయటపడుతుందని ఒక కంపెనీ ప్రతినిధి చెప్పారు. దిగుమతి చేసుకుంటున్న కొన్ని రా మెటీరియల్స్ రేట్లయితే ఏకంగా 60 నుంచి 70 పెరిగాయని పేర్కొన్నారు. ఫ్రైట్, ఇతర రవాణా, ప్యాకేజింగ్ ఖర్చులు అలాగే పెరిగాయని చెప్పారు. ఫలితంగా రేట్లను 20 శాతం పెంచాలని కిందటేడాదే ప్రభుత్వాన్ని కోరామని వెల్లడించారు. కార్డియో వాస్కులార్, డయాబెటిస్, యాంటిబయాటిక్స్, యాంటి–ఇన్ఫెక్టివ్స్, విటమిన్స్ వంటి మెడిసిన్స్ తయారీకి ఏపీఐలు, ఇంటర్మీడియెట్స్ను చైనా నుంచే మన దేశం దిగుమతి చేసుకుంటోంది. కొన్ని రా మెటీరియల్స్లోనైతే 80 నుంచి 90 శాతం దాకా అవసరాలకు ఆ దేశం మీదే ఆధారపడుతున్నాం. 2020 లో కరోనా వైరస్ ఎఫెక్ట్ మొదలైనప్పటి నుంచీ చైనా నుంచి రా మెటీరియల్స్ సప్లయ్లు తగినంతగా రావడం లేదు. దీంతో కొరత పెరిగి రేట్లు అధికమయ్యాయి. ఫలితంగా ఫార్మా కంపెనీల తయారీ ఖర్చులు తడిసి మోపెడయ్యాయి.