పొరుగు దేశాన్ని పొగిడిన నిరసనకారులకు ఎస్పీ సలహా
మీరట్:
‘పాకిస్తాన్ అంత బాగుంటే మీరు అక్కడికే పోండి’ అంటూ నిరసనకారులను ఉద్దేశించి మీరట్ ఎస్పీ చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. ఈ నెల 20న మీరట్లో జరిగిన గొడవపై ఇప్పుడు ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వ అధికారి అలాంటి కామెంట్స్ ఎలా చేస్తారంటూ మీరట్ ఎస్పీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఇంకో అడుగు ముందుకేసి.. ప్రజల మనస్సుల్లో బీజేపీ మతంపేరుతో విషం చిమ్ముతోందని విమర్శించారు. ఎస్పీ కామెంట్స్చేసిన వీడియోను ట్వీట్ చేస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ గొడవపై మీరట్ ఎస్పీ స్పందిస్తూ ఆ రోజు ఏంజరిగిందో చెప్పుకొచ్చారు. సిటిజన్షిప్అమెండ్మెంట్ యాక్ట్కు వ్యతిరేకంగా మీరట్లో గత శుక్రవారం(ఈ నెల 20) ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చారు. నిరసనలో భాగంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనకారులను అడ్డుకోవడానికి జిల్లా కలెక్టర్తో పాటు మీరట్ ఎస్పీ అఖిలేశ్ నారాయణ్ సింగ్ అక్కడికి వచ్చారు. వీళ్లను చూసి నిరసనకారులు రెచ్చిపోయారు. పాకిస్తాన్కు అనుకూలంగా నినాదాలు చేశారు. పోలీసులు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా వినలేదు. దీనిపై మండిపడ్డ ఎస్పీ వారిపై విరుచుకుపడ్డారు. ‘ఇక్కడి తిండి తింటూ పక్క దేశాన్ని పొగుడుతారా? పాకిస్తాన్లో అంతబాగుంటుందనుకుంటే అక్కడికే వెళ్లిపోండి. ఈ గల్లీ(వీధి)ని నేను గుర్తుపెట్టుకుంటా.. గుర్తుంచుకుంటే మిమ్మల్నే కాదు, మీ నానమ్మనైనా వెతుక్కుంటూ వస్తా’ అని అన్నారు.