కోఠిలోని చిరు వ్యాపారులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చిన మెట్రో

కోఠిలోని చిరు వ్యాపారులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చిన మెట్రో

హైదరాబాద్ : అది ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న షాపింగ్ ఏరియా. నగరవాసుల నుంచి జిల్లా వారి వరకు అందరు ఇక్కడ షాపింగ్ చేస్తుంటారు. కానీ మోడ్రన్ ట్రాన్స్ పోర్ట్, మెట్రో వచ్చాక అక్కడ వ్యాపారాలు చేసుకునే వారి పరిస్థితి అధ్వానంగా మారింది. వందల ఏళ్ల చరిత్ర ఉన్న బడిచౌడి, సుల్తాన్ బజార్ చిరు వ్యాపారులకు మెట్రో ప్రాజెక్ట్ తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. కొత్తగా ఏర్పాటు చేసిన కియోస్క్ లలో తమకు కేటాయింపులు చేయలేదని.. తమకు ప్రభుత్వమే న్యాయం చేయాలని కోరుతున్నారు.

సుల్తాన్ బజార్ లోని వీధి వ్యాపారులకు ఇబ్బందులు తప్పడం లేదు. అల్ట్రా మోడ్రన్ షాపింగ్ ఫెసిలిటీ కల్పిస్తామని గతంలో ఇచ్చిన హామీని మెట్రో అధికారులు మర్చిపోయారు. ఎంజీబీఎస్ నుంచి జేబీఎస్ మార్గంలో సుల్తాన్ బజార్ మీదుగా మెట్రోలైన్ ప్రారంభమైనా..మెట్రో పిల్లర్ల కింద  నిర్మించి ఇస్తామన్న కియోస్కీలను… ఏళ్లుగా ఇక్కడే వ్యాపారం చేసుకుంటున్న వారికి కేటాయించడం లేదు.

5 ఫీట్ల విస్తీర్ణంలో సుల్తాన్ బజార్ వీధి వ్యాపారులకు షాప్ లు నిర్మించారు. ఈ కియోస్క్ లను స్ట్రీట్ వెండర్స్ కు ఉపాధి కల్పించేలా చర్యలు చేపడతామని గతంలో హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు తమను పట్టించకోకపోవడంతో అడ్డా కోల్పోయి రోడ్డున పడ్డామంటున్నారు వ్యాపారులు. స్ట్రీట్ వైడనింగ్, మెట్రో వర్క్ జరిగినన్ని రోజులు బిజినెస్ లేకుండా పోయిందన్నారు. ఇప్పుడు ఎల్ అండ్ టీ మెట్రో స్టాల్స్ తో రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందంటున్నారు స్ట్రీట్ వెండర్స్. సుల్తాన్ బజార్ మార్కెట్ ల్లో దాదాపు నాలుగు వందల మంది చిన్నవ్యాపారులు… తోపుడు బండ్లు, ఫుట్ పాత్ లపై జీవిస్తున్నారు.  వీళ్ళల్లో 165 మంది వ్యాపారులను మాత్రమే ఎంపిక చేయగా.. 235 మంది హ్యాకర్లకు ఉపాధి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కోఠి, సుల్తాన్ బజార్ నుంచి కాచిగూడ బిగ్ బజార్ వరకు పుట్ పాత్, తోపుడు బండ్లు, కాలినడకన వ్యాపారం చేసే వారిని జీహెచ్ఎంసీ గతంలోనే గుర్తించింది. వీరిలో కొందరికి స్ట్రీట్ వెండింగ్ ఐడెంటీ కార్డులు కూడా ఇచ్చింది. అయితే బల్దియా గుర్తించిన చిన్న వ్యాపారులను కాకుండా బడా వ్యాపారులను మాత్రమే మెట్రో జాబితాలో చేర్చినట్టు ఆరోపణలు వస్తున్నాయి. గతంలో లాగా ప్రస్తుతం సుల్తాన్ బజార్ గల్లీలో వ్యాపారం చేసుకోలేని పరిస్థితి ఉంది. ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులతోనూ వేధింపులు తప్పడంలేదని వాపోతున్నారు. గతంలో ఇక్కడ బిజినెస్ చేసుకున్న అందరికీ కియోస్కీలు ఇవ్వాలని కోరుతున్నారు. బ్రిటీష్ కాలం నుంచి ఉన్న సుల్తాన్ బజార్ హెరిటేజ్ మార్కెట్లో వస్తువులకి ఇప్పటికీ డిమాండ్ తగ్గలేదు. మెట్రో వచ్చాక వ్యాపారం చేసుకునే ప్లేస్ లేక కుటుంబం గడవటం కష్టంగా ఉందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.