
- హెలెన్ కిల్లర్ 145వ జయంతి వేడుకల సందర్భంగా దివ్యాంగులతో మంత్రి సహపంక్తి భోజనం
హైదరాబాద్, వెలుగు: దివ్యాంగులకు ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని, ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. శుక్రవారం అమెరికన్ రచయిత హెలెన్ కిల్లర్ 145వ జయంతి వేడుకలు మలక్ పేట్లోని దివ్యాంగుల, వయో వృద్ధులు, ట్రాన్స్జెండర్ల సంక్షేమం, సహకార శాఖ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడ్లూరి హాజరై, హెలెన్ కిల్లర్ విగ్రహానికి పూల మాల వేసి, నివాళులు అర్పించారు. అనంతరం అక్కడే ఆవరణలో ఉన్న బధిరుల స్కూల్ విద్యార్థులతో కలసి సహాపంక్తి భోజనం చేశారు. విద్యార్థులకు మంత్రి స్వయంగా భోజనం వడ్డించడంతో దివ్యాంగుల సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ.. తాను పేద కుటుంబం నుంచి వచ్చానని, సామాన్యుల బాధలు తెలుసన్నారు.
తనపై నమ్మకంతో సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖలు కేటాయించారన్నారు. గత ప్రభుత్వం దివ్యాంగుల కార్పొరేషన్కి పదేండ్లలో రూ.64 కోట్లు కేటాయిస్తే, తమ ప్రభుత్వం రెండేండ్లలోనే రూ.100 కోట్లు కేటాయించిందన్నారు. హెలెన్ కిల్లర్ పుట్టుకతోనే మూగ, చెవుడు, అంధురాలైనా ఆమె వెనుకడుగు వేయకుండా రచయితగా, విద్యావేత్తగా, సామాజిక హక్కుల ఉద్యమకారిణిగా రాణించారని పేర్కొన్నారు.
దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రజిని అనే దివ్యాంగురాలికి జాబ్ ఇచ్చి, చరిత్రలోనే దివ్యాంగుల గురించి క్షణాల్లో ఆలోచించే సీఎంగా చరిత్ర సృష్టించారని కొనియాడారు. మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే దివ్యాంగుల కోసం 2,367 స్వయం సహాయక సంఘాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారని చెప్పారు.
అలాగే, దివ్యాంగులకు ఉన్నత విద్యలో 5 శాతం, కోర్టు ఉద్యోగాల్లో 5 శాతం రిజర్వేషన్లు, నిరుద్యోగులకి ప్రత్యేక జాబ్ పోర్టల్, హైదరాబాద్ జిల్లాలో ఏడేండ్లుగా పెండింగ్లో ఉన్న 18 మంది దివ్యాంగులకు బ్యాక్ లాగ్ ఉద్యోగాలను ఇవ్వాలని మంత్రిని ఆయన కోరారు.