- పెట్టుబడులకు తెలంగాణ భూతల స్వర్గం
- మూసీ నదిని గోదావరి, కృష్ణా నీళ్లు పారించి శుద్ధి చేస్తం
- పారిశ్రామికవేత్తలకు రాయితీలిస్తమని ప్రకటన
- సీఐఐ సమావేశానికి హాజరు
హైదరాబాద్, వెలుగు: పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం భూతల స్వర్గమని, పెట్టుబడులకు అనుకూలమైన భౌగోళిక వాతావరణం ఏ రాష్ట్రంలోనూ లేనంతగా తెలగాణలోనే ఉందని డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఇతర ప్రాంతాల వాళ్లు ఏ సీజన్లో ఇక్కడికి వచ్చినా ఆనందంగా గడుపుతారని తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్), రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) మధ్య టెక్స్టైల్స్, ఐటీ, డెయిరీ క్లస్టర్లను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు.
శనివారం హైటెక్ సిటీలోని ప్రైవేట్ హోటల్లో నిర్వహించిన సీఐఐ రాష్ట్ర వార్షిక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న మానవ వనరులు ఏ రాష్ట్రంలోనూ లేవన్నారు. మౌలిక సదుపాయాల విషయానికి వస్తే శంషాబాద్ ఎయిర్ పోర్టు, ఔటర్ రింగ్ రోడ్డు సహా కావాల్సినంత భూమి ఈ రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ‘‘ఇతర రాష్ట్రాల వాళ్లు ఇక్కడికి వచ్చినా భాష సమస్య అనేది ఉండదు. అన్ని భాషలూ ఇక్కడ మాట్లాడుతారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుని ఆరోగ్యాలు బాగు చేసుకుంటారు.
ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, ఉస్మానియా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వంటి గొప్ప యూనివర్సిటీలు ఇక్కడ ఉన్నాయి” అని వివరించారు. గత ప్రభుత్వంలో పారిశ్రామిక వేత్తలకు తలుపులు మూసేసే పద్ధతి ఉండేదని, కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం అలా ఉండదన్నారు. పారిశ్రామికవేత్తల కోసం సీఎం, మంత్రులు 24 గంటలు అందుబాటులోనే ఉంటారని, సెక్రటేరియెట్తో పాటు వారి ఇండ్ల తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని స్పష్టం చేశారు.
హైదరాబాద్ రాజ్యం
ఇతర రాష్ట్రాల్లోని నగరాల్లో అర్బన్, రూరల్ ప్రాంతాలు కలిసిపోయి ఉంటాయని, కానీ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ ఒక రాజ్యంలా మిగిలిన జిల్లాలు సెమీ అర్బన్ వాతావరణంతో ఉంటాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ‘‘ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు త్వరలో రీజినల్ రింగ్ రోడ్డు పనులు ప్రారంభం కానున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్డు మధ్య అనేక క్లస్టర్లు అభివృద్ధి చేస్తాం. గతంలో ఫార్మాసిటీ అంటే ఒకే చోట 30,000 ఎకరాల్లో ప్రణాళికలు రూపొందించారు. అది ప్రజల ఆరోగ్యం రీత్యా సరైన విధానం కాదు. మేము అన్ని వసతులతో కూడిన ఫార్మా విలేజీలు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నాం. ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ల మధ్య టెక్స్టైల్స్, ఐటీ, డెయిరీ క్లస్టర్లను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు
రూపొందిస్తున్నాం’’ అని ఆయన వెల్లడించారు.
మూసీని నిర్లక్ష్యం చేశారు
గత పాలకులు మూసీ నదిని నిర్లక్ష్యం చేశారని, దీంతో అది డ్రైనేజీ కాలువలా మారిందని భట్టి విక్రమార్క అన్నారు. ‘‘మూసీ నది పునరుజ్జీవానికి మా ప్రభుత్వం సంకల్పించింది. ఈసీ, మూసీ నదుల నుంచి వచ్చే స్వచ్ఛమైన నీటితో పాటు.. ఎత్తిపోతల పథకాల ద్వారా హైదరాబాద్కు వస్తున్న గోదావరి, కృష్ణా నదుల నీళ్లను మూసీకి అనుసంధానం చేసి స్వచ్ఛమైన నీటిని పారించి మూసీని ప్రక్షాళన చేయబోతున్నాం. లండన్లోని థేమ్స్ నదిని మోడల్గా తీసుకొని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. మూసీ పరివాహక ప్రాంతంలో చెక్ డ్యామ్, చిల్డ్రన్ పార్క్, ఫ్లై ఓవర్స్, ఎంటర్టైన్మెంట్, బోటింగ్ వంటి వాటిని పీపీపీ (పబ్లిక్, ప్రైవేట్) మోడల్లో అభివృద్ధి చేస్తాం’’ అని ఆయన చెప్పారు.
శాటిలైట్ టౌన్షిప్లు
సామాన్యుడు ఇంటి స్థలం, ఇల్లు కొనే పరిస్థితి లేదని భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని వసతులతో శాటిలైట్ టౌన్షిప్లను నిర్మించేందుకు సిద్ధమవుతున్నామన్నారు. ‘‘30 ఏండ్ల కింద ఆసియాలోనే అతిపెద్ద హౌసింగ్ కాలనీ కూకట్పల్లిలో నిర్మాణం జరిగింది. అది నిర్మాణం జరగడంతోనే వేలాది మందికి ఆశ్రయం ఏర్పడి పరిశ్రమలు హైదరాబాద్లో నిలదొక్కుకున్నాయి. రక్షణ, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాలపై గత ప్రభుత్వం దృష్టి సారించలేదు. ఈ రంగాలపై ఆసక్తి చూపెట్టే పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది.
తెలంగాణ మనది మనందరిదీ. సంపద సృష్టించడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది’’ అని ఆయన చెప్పారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చే పారిశ్రామికవేత్తలకు కాంగ్రెస్ ప్రభుత్వం రాయితీలు ఇవ్వడంతో పాటు పూర్తి సహకారం అందించడానికి సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రంలో పాల ఉత్పత్తికి వినియోగం మధ్యన చాలా గ్యాప్ ఉన్నందున డెయిరీని డెవలప్ చేసేందుకు మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. స్వచ్ఛమైన పాలను అందించగలిగే విధంగా డెయిరీ ఇండస్ట్రీని ఏర్పాటు చేసుకుంటే భవిష్యత్తుకు మేలు చేసిన వాళ్లమవుతామని అన్నారు.
అత్యధిక ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అనువుగా ఉన్న ఎంఎస్ఎంఈ పరిశ్రమలను తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో సీఐఐ తెలంగాణ చైర్మన్ శేఖర్ రెడ్డి, ప్రత్యేక అతిథిగా సీఐఐ దక్షిణ ప్రాంత చైర్మన్ కమల్ బాలి, సీఐఐ తెలంగాణ వైస్ చైర్మన్ సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రకృతిని కాపాడేందుకు లక్షకు పైగా మొక్కలు నాటిన ప్రగతి గ్రూప్స్ చైర్మన్ డాక్టర్ జీవీకే రావు తో పాటు మరో నలుగురికి జ్ఞాపికలు అందించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభినందించారు.