
- ప్రతిచోటా జనరేటర్లు పెట్టండి
- ఆఫీసర్లకు మంత్రి దామోదర ఆదేశం
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిరంతరం విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా జనరేటర్ సౌకర్యం లేని ఆస్పత్రుల్లో ఆటోమేటెడ్ జనరేటర్ లను సమకూర్చుకోవాలని స్పష్టం చేశారు. బుధవారం ఆయన సెక్రటేరియెట్ లో హెల్త్ ఆఫీసర్లతో రివ్యూ చేపట్టారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.."ఆస్పత్రుల్లో విద్యుత్ నిర్వహణ కోసం తాత్కాలిక పద్ధతిలో ఎలక్ట్రికల్ ఇంజినీర్లను నియమించుకోండి. విద్యుత్ సరఫరాకు అవసరమైన పరికరాలను, సామగ్రిని అందుబాటులో ఉంచుకోవాలి.
ఆస్పత్రుల్లో నిరంతరం విద్యుత్ సౌకర్యం ఉండేలా చర్యలు చేపట్టాలి. అందుకు జిల్లా వైద్య, విద్యుత్ అధికారులు సమన్వయంతో పనిచేయాలి" అని మంత్రి ఆదేశించారు. అలాగే..వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని సీజనల్ వ్యాధుల నిర్మూలనకు ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా లతో పాటు కరోనా టెస్ట్ కిట్స్ లను, అవసరమైన మందులను కొనుగోలు చేయాలని టీజీఎంఎస్ ఐడీసీ అధికారులను ఆదేశించారు. అధికారులు సమన్వయంతో శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి సాధించాలని మంత్రి పేర్కొన్నారు.