
ఎర్రగడ్డ ఆస్పత్రిలో ఫుడ్ పాయిజన్ ఘటనపై హెల్త్ మినిస్టర్ సీరియస్ అయ్యారు. జూన్ 4న ఉదయం ఆస్పత్రిని సందర్శించిన మంత్రి ఆస్పత్రి సిబ్బందితో మాట్లాడి ఫుడ్ పాయిజన్ ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆస్పత్రి సూపరింటెండెంట్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.జూన్ 2న ఏర్పాటు చేసిన స్పెషల్ ఫుడ్ వల్లే అస్వస్థతకు గురయ్యారని చెప్పారు. డైట్ కాంట్రాక్టర్ కాంట్రాక్ట్ రద్దు చేశారు.
అనంతరం ఘటన గురించి మాట్లాడిన మంత్రి.. జూన్ 2 అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫుడ్ ద్వారానే అస్వస్థతకు రోగులు గురైనట్లు ప్రాథమికంగా గుర్తించాం. డైట్లో స్వీట్ ఏర్పాటు చేయడం వల్లనే ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నాం. ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చిన అనంతరం అస్వస్థతకు గల కారణాలను పూర్తిస్థాయిలో వివరాలు తెలియజేస్తాం. ఫుడ్ పాయిజన్ కారణంగా మొత్తం 92 మంది రోగులు అస్వస్థతకు గురయ్యారు. వీళ్లలో 74 మంది రోగులు ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారు. 18 మంది రోగుల ఆరోగ్య పరిస్థితి బాగా లేకుంటే ఉస్మానియా ఆస్పత్రికి తరలించాం.అక్కడ వాళ్ల ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉంది. రోగులు అస్వస్థతకు గురైన సమయంలోనే కరణ్ అనే వ్యక్తి చనిపోయాడు. కరణ్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం, ల్యాబ్ రిపోర్ట్స్ ఆధారంగా వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం. మానసిక వైద్యశాలలో అస్వస్థత గురైన విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఐదు మంది సభ్యులతో కూడిన కమిటీని వేసి పరిస్థితిని పర్యవేక్షిస్తుంది.
దేశంలో కరోనా కేసులు నమోదు అవుతున్న వేళ రాష్ట్రంలో అన్ని ఆసుపత్రిలో కరోనాకు సంబంధించిన కిట్లను సంబంధించిన అన్ని ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. ప్రజలకు వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే ఏ స్థాయి ఉద్యోగులైన చర్యలు తీసుకునేందుకు ఉపేక్షించబోమని హెచ్చరించారు మంత్రి దామోదర రాజనర్సింహా.