రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ రెండు డోసుల వాక్సిన్ త్వరగా పూర్తి చేయాలన్నారు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు. దీనికి సంబంధించి అన్ని జిల్లాల వైద్యాధికారులను ఆదేశించారు. ప్రతీ ఒక్కరికి వాక్సిన్ ఇవ్వాలని సూచించారు. బుధవారం బీఆర్కే భవన్ లో అన్ని జిల్లాల వైద్యాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రి హరీశ్. రాష్ట్రంలో ని ఏ గ్రామాన్ని వదలకుండా వాక్సినేషన్ ప్రక్రియ వేగంగా చేపట్టాలన్నారు. వందకు వంద శాతం మొదటి డోస్, రెండో డోస్ పూర్తి చేయాలన్నారు. పట్టణాల్లో జనాభా ఎక్కువ ఉంటే రూరల్ లో పని చేస్తున్న వైద్య సిబ్బంది సహకారంతో వాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. ఏ జిల్లా కూడా వాక్సినేషన్ లో వెనుకపడకూడదన్నారు.
వికారాబాద్ జిల్లాలో వాక్సిన్ ప్రక్రియ వేగంగా సాగుతోందని.. ఇదే తీరులో అన్ని జిల్లాలు ముందుకు సాగాలన్నారు మంత్రి హరీశ్ రావు. ప్రతీ డీఎం అండ్ హెచ్ వో ఫీల్డ్లో ఉండి వాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. జిల్లా కలెక్టర్ తో పాటు అన్ని శాఖల తో సమన్వయం చేసుకుని వాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. వారం తర్వాత కలెక్టర్లతో ఈ విషయంలో సమీక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు. ఇప్పటికే అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని నెంబర్ వన్ గా ఉండేలా సీఎం కేసీఆర్ తీర్చిదిద్దారని.. అదే స్ఫూర్తితో వాక్సినేషన్ లో రాష్ట్రం.. దేశానికే ఆదర్శంగా ఉండేలా పని చేయాలన్నారు. టీమ్ వర్క్ తో ఇది సాధ్యమవుతుందన్నారు.