కేంద్రానికి మంత్రి హరీష్ రావు కీలక లేఖ..

కేంద్రానికి మంత్రి హరీష్ రావు కీలక లేఖ..

కేంద్ర ప్రభుత్వానికి మంత్రి హరీష్ రావు కీలక లేఖ రాశారు. మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేయొద్దు మంత్రి హరీష్ రావు కేంద్రాన్ని లేఖలో కోరారు. దేశ రక్షణ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న మెదక్ సహా ఇతర ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను ప్రైవేటీకరించొద్దని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు లేఖ రాశారు. దేశ భద్రత, 74 వేల మంది ఉద్యోగులను దృష్టిలో ఉంచుకోవాలన్నారు. 

డిఫెన్స్ రంగంలో ఉన్న ఏడు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం ద్వారా ఆయా సంస్థల మధ్య పోటీ నెలకొంటుందని మంత్రి హరీష్ రావు అన్నారు. దీంతో నూతన ఆయుధాల అభివృద్ధి నిలిచిపోతుందని చెప్పారు. ఇది మేకిన్ ఇండియా స్ఫూర్తిని దెబ్బతీస్తుందని తెలిపారు. మెదక్ లోని సిబ్బందికి గత ఆర్థిక సంవత్సరంలో కావాల్సినంత పని ఉండేదని.. దాదాపు రూ.930 కోట్ల ఆర్డర్లను సమయానికి పూర్తి చేశారని పేర్కొన్నారు. సంస్థ సిబ్బంది ఎలాంటి సవాళ్లనైనా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నారని... కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సంస్థకు పెద్దగా పని అప్పగించలేదన్నారు. దీనిని సాకుగా చూపి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని "సిక్ ఇండస్ట్రీ" గా ప్రకటిస్తారని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని మంత్రి వెల్లడించారు. ఇదే జరిగితే ప్రత్యక్షంగా 2500 మంది ఉద్యోగులు, పరోక్షంగా 5వేల మంది ఉపాధి దెబ్బతింటుందన్నారు. మొత్తంగా సుమారు 25వేల మంది భవిష్యత్తు అంధకారంలో పడుతుందని లేఖలో తెలిపారు. ఈ నేపథ్యంలో "ఆయుధ కర్మాగార తెలంగాణ ఉద్యోగుల సమాఖ్య" ప్రతినిధులు తన దగ్గరికి వచ్చి ప్రైవేటైజేషన్ను అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారని.. ఆరు డిమాండ్లను తన ద్వారా కేంద్రం ముందు ఉంచుతున్నానని మంత్రి హరీష్ రావు తెలిపారు. 

లేఖలో తెలిపిన డిమాండ్లు

1. మూడు రైతు చట్టాల మాదిరిగానే డిఫెన్స్ రంగా సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి.
2. పరిశోధనల విభాగాన్ని మరింత పటిష్టం చేయాలి. 
3. మిషనరీని ఆధునికరించాలి. ఉద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలి.
4. పరిపాలన, కొనుగోలు విధానాలను సరళీకరించాలి.
5. ఆర్మీ అవసరాలకు అనుగుణంగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి ఆర్డర్లు ఇవ్వాలి. 
6. ప్రసార భారతిలో మాదిరిగానే ఉద్యోగులకు భద్రత కల్పించాలి.
వీటిని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతున్నాను.