
నల్గొండ, వెలుగు : సీఎం చంద్రబాబే వచ్చినా బనకచర్ల ప్రాజెక్ట్ను అడ్డుకొని తీరుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సోమవారం మీడియాతో మాట్లాడారు. బనకచర్ల ప్రాజెక్ట్ను ఎట్టి పరిస్థితిలోనూ కట్టనివ్వబోమని, ప్రాజెక్టుపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని వెల్లడించారు. ప్రాజెక్ట్ కట్టే నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం విరమించుకోవాలని కోరారు. బీఆర్ఎస్ లీడర్లు కమిషన్ల కోసం లక్షల కోట్లు ఖర్చు చేసి తెలంగాణను అప్పుల పాలు చేయడమే కాకుండా.. కూలిపోయే ప్రాజెక్ట్లు కట్టి ఇప్పుడు ఘోష్ కమిషన్ చుట్టూ తిరుగుతున్నారన్నారు.
ఘోష్ కమిషన్ ముందు హరీశ్రావు అన్నీ అబద్ధాలే చెబుతున్నారన్నారు. పదేండ్ల పాలనలో కేసీఆర్ ఎన్నో అక్రమాలకు పాల్పడ్డాడని, నల్గొండ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్ట్లను పూర్తి చేయని కేసీఆర్... కృష్ణా జలాలు రాయలసీమకు తరలించుకుపోయేలా సహకరించి నల్గొండ ప్రజల పొట్ట కొట్టారని మండిపడ్డారు. ఫోన్ టాపింగ్ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకోవడంతో బీఆర్ఎస్ డైరెక్షన్లో దాక్కున్న ప్రభాకర్రావు ఎట్టకేలకు బయటకు వచ్చాడన్నారు. కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని సొంత బిడ్డే చెబుతుందని... అయినా కేసీఆర్కు జ్ఞానోదయం కలగట్లేదని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలనే కాకుండా.. ఇవ్వని వాటిని కూడా నెరవేరుస్తోందన్నారు. రాబోయే ఐదేండ్లలో ఐదు లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించనున్నట్లు చెప్పారు. మరో మూడేండ్లలో శ్రీశైలం టన్నెల్ను పూర్తి చేసి నీళ్లు అందిస్తామన్నారు. రూ.11 వేల కోట్లతో దేశంలోనే ఆదర్శవంతమైన రోడ్లు నిర్మించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. సమావేసంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్నాయక్ పాల్గొన్నారు.