తెలంగాణలో హ్యామ్ ప్రాజెక్టుతో రోడ్లకు మహర్దశ : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

తెలంగాణలో హ్యామ్ ప్రాజెక్టుతో రోడ్లకు మహర్దశ : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
  • ఫేజ్1లో5,190 కిమీల రోడ్ల మరమ్మతు
  • ఆర్ అండ్ బీ ఆఫీసర్లతో రివ్యూ మీటింగ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రోడ్లు, భవనాల(ఆర్ అండ్ బీ)శాఖ, పంచాయతీ రాజ్ రోడ్లకు హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్) ప్రాజెక్టు ద్వారా మహర్దశ రానుందని ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. పదేండ్లుగా మరమ్మతులు జరగని, దెబ్బతిన్న రోడ్లను బాగుచేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. బుధవారం ఆయన హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని సెక్రటేరియెట్‌‌‌‌‌‌‌‌లో ఆర్ అండ్ బీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 

హ్యామ్ ప్రాజెక్టు కింద చేపట్టాల్సిన మరమ్మతులు, ప్రతిపాదనలపై విస్తృతంగా చర్చించారు. ఫేజ్-1లో 5,190 కిలోమీటర్ల రహదారులను గుర్తించామని, వీటికి సంబంధించిన ఖర్చు అంచనాలు, అమలు విధానాలు, నిధుల సమీకరణ పద్ధతులపై సమీక్ష జరిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ..గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య అనుసంధానాన్ని మెరుగుపరచడమే హ్యామ్ ప్రాజెక్టు లక్ష్యమని తెలిపారు. "తక్కువ టైంలో మంచి నాణ్యమైన రహదారుల నిర్మాణమే ఈ మోడల్ ఉద్దేశం. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా.. పట్టణ,-గ్రామీణ ప్రాంతాల మధ్య బలమైన అనుసంధానం కల్పిస్తూ, రాష్ట్ర వృద్ధికి దోహదపడేలా రోడ్ల నిర్మాణం జరుగుతుంది" అని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. 

హ్యామ్ ప్రాజెక్టు మరమ్మతులు, నిర్మాణాలకు తెలంగాణ కేబినెట్ ఆమోదం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. సమావేశంలో రోడ్ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ కార్పొరేషన్ (ఆర్డీసీ) చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి, ఆర్ అండ్ బీ స్పెషల్ సెక్రటరీ దాసరి హరిచందన, ఇంజనీర్- ఇన్ -చీఫ్ (ఈఎన్సీ) తిరుమల, చీఫ్ ఇంజనీర్ (సీఈ) మోహన్ నాయక్‌‌‌‌‌‌‌‌ తదితరులు పాల్గొన్నారు.