ముఖ్యమంత్రులను ఉరికిచ్చిన చరిత్ర కేసీఆర్ ది , మీరెంత?

ముఖ్యమంత్రులను ఉరికిచ్చిన చరిత్ర కేసీఆర్ ది , మీరెంత?

రాజన్న సిరిసిల్ల:

నిన్న, ఇవ్వాళ పుట్టుకొచ్చిన‌ కొంతమంది నాయకులు కేసీఆర్ మీద ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని… ఇష్టారీతిగా మాట్లాడితే.. చూస్తు ఊరుకోమని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన టీఆర్ఎస్ జిల్లా స్థాయి మీటింగ్ లో కేటీఆర్ మాట్లాడుతూ.. ఓపికకు హద్దులుంటాయని.. హద్దు దాటి మాట్లాడితే ఎవరినీ వదిలిపెట్టే సమస్యే లేదన్నారు. తమ ఓపికను, సహనాన్ని అసమర్ధంగా భావించొద్దని వార్నింగ్ ఇచ్చారు. ఓపిక నశిస్తే ప్రధాన మంత్రిని, కేంద్రమంత్రులను కూడా ఒదిలిపెట్టమ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

రాజకీయాలకు సమయం సందర్భం ఉంటుందని అన్నారు. 20 ఏళ్లలో గెలుపోటములను ఎన్నో చూసాం. ఎన్ని అవంతరాలు వచ్చినా ఎత్తిన జెండా దించకుండా పోరాటం చేసాం. ఆనాటి ముఖ్యమంత్రులను ఉరికిచ్చిన చరిత్ర కేసీఆర్ ది. టీ-కాంగ్రెస్, టీ-బీజేపీ నాయకులను ఆనాడు గంజిలో ఈగల్లెక్క ఆంధ్రా నాయకులు తీసేసారు. ఆనాడు మీ బతుకులేందో గుర్తు తెచ్చుకోండి. రాయలసీమ నాయకుల ముందు చేతులు కట్టుకుని నిల్చున్న బతుకులు మీవి. తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే ఒక్కడన్నా ముందుకొచ్చిండా? అని ప్ర‌శ్నించారు.

తెలుగు గడ్డమీద పుట్టిన ప్రాంతీయ పార్టీల్లో బతికి బట్టకట్టినవి రెండే రెండు. ఒకటి టీడీపీ, రెండోది టీఆర్ఎస్. తెలంగాణ సాధన లక్ష్యంగా ఏర్పడిన టీఆర్ఎస్… రాష్ట్రం సాధించడంతో పాటు, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తోంది. రెండు దశాబ్దాల కిందట తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర ఆకాంక్ష నెరవేరాలని కేసీఆర్ సమాలోచనలు చేసి పార్టీని స్థాపించారు. ఆనాడు చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటంతో పాటు అప్పటి ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామి ఉండేవారు. ఇంకోవైపు తెలంగాణ ఆకాంక్షను దశాబ్దాల పాటు అణగదొక్కిన కాంగ్రెస్, ఒక్కరాష్ట్రం రెండు రాష్ట్రాలని చెప్పి మోసం చేసిన బీజేపీ లాంటి మూడు దిగ్గజ పార్టీలను ఎదిరించి కేసీఆర్ నిలబడ్డారు.

జయశంకర్ లాంటి మేధావులు తెలంగాణ ఆకాంక్షను నిలబెడుతూ వచ్చినా… ముందుకు తీసుకెళ్లే నాయకుడు లేక తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్న సమయంలో కేసీఆర్ ఆ బాధ్యత తీసుకున్నారు. ఆనాడు ఏవీ మనకు అనుకూలంగా లేకున్నా ఒక్కడుగా కేసీఆర్ బయలుదేరారు. మీడియా వాళ్లు, వ్యాపారులు రాష్ట్ర ఆకాంక్షకు మద్ధతు ఇవ్వలేదు. ఇదేం జెండా, ఇదే పార్టీ అని కేసీఆర్ ను ఎందరో అపహాస్యం చేసినా.. ఒక్కడే రాష్ట్ర సాధన కోసం బయలుదేరారు. కేంద్రం, రాజకీయ వ్యవస్థలన్నీ వ్యతిరేకించిన సమయంలో ప్రజల మద్ధతుతో కేసీఆర్ ముందుకు సాగారు.

47 ఏళ్ల వయస్సులో త్యాగం చేసి, ధైర్యం చేసి పార్టీని స్థాపించడంతో పాటు ప్రజల అనుమానాలు పటాపంచాలు చేస్తూ ఉద్యమాన్ని నడిపించారు. పార్టీ స్థాపించిన రోజే తనకున్న మూడు పదవులను వదిలేసారు. రాష్ట్రం వచ్చేదాకా తెలంగాణ ఉద్యమాన్ని వదిలిపెడితే రాళ్లతో కొట్టి చంపాలని చెప్పిన ధైర్యమున్న నేత కేసీఆర్. ఇంతటి సాహసోపేతమైన మాట చెప్పిన నాయకుడు దేశ చరిత్రలో ఎవరైనా ఉన్నారా? అలాంటి కేసీఆర్ ను నిన్న, ఇయాల పుట్టిన నాయకులు ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. టీకాంగ్రెస్, టీబీజేపీ నాయకుల్లారా మీ బతుకలకు ఆ పదవులు తెలంగాణ వల్లే వచ్చాయి. కేసీఆర్ లేకపోతే మీకు ఆ పదవులెక్కడివి? ఆయన పదవికి, వయస్సుకు కూడా గౌరవం ఇవ్వకుండా మాట్లాడుతున్నారు. రెండు మూడు నెలలకింద వచ్చినోడే అట్లా మాట్లాడితే మనమెన్ని మాట్లాడాలే? 1, 2 సీట్లు గెలిచినోల్లు ఎగిరెగిరి పడితే.. పంచాయితీ నుంచి అసెంబ్లీ దాకా 90 శాతం సీట్లు గెలిచిన మేమెంత ఎగరాలే? అని కేటీఆర్ మండిప‌డ్డారు.