ఆలయాలను అభివృద్ధి చేస్తం: పొంగులేటి

ఆలయాలను అభివృద్ధి చేస్తం: పొంగులేటి

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని చాటేలా రాష్ట్రంలోని ఆలయ  అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని వరంగల్ జిల్లా ఇన్-చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగా మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తామన్నారు. వరంగల్ కాళోజీ కళాక్షేత్రం పనుల పురోగతి, భద్రకాళి దేవస్థానం అభివృద్ధి పనులపై మంగళవారం సెక్రటేరియెట్​లో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క, వరంగల్ వెస్ట్  ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డితో కలిసి పొంగులేటి రివ్యూ చేశారు. చారిత్రాత్మక భద్రకాళి  దేవస్థానం అభివృద్ధి పనులను ఆగమశాస్త్ర ప్రకారం చేపట్టాలని అధికారులకు ఆయన సూచించారు.

రూ.30 కోట్లతో దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తున్నామని, ఇందులో రూ.20 కోట్లు ఎస్డీఎఫ్, రూ.10 కోట్లు కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ  సమకూరుస్తున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. కాళోజీ నారాయణరావు కళాక్షేత్ర పనులను రెండు నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను కూడా తనిఖీ చేయాలని, జరిగిన పనులకంటే ఎక్కువ మొత్తంలో కాంట్రాక్టర్లకు నిధుల విడుదలపైనా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ రివ్యూలో ఎండోమెంట్ కమిషనర్ అనిల్ కుమార్, ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్, హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ పాల్గొన్నారు.