హైదరాబాద్: ట్యాంక్ బండ్ దగ్గర తెలంగాణ గంగా తెప్పోత్సవం, గంగమ్మ బోనాల ఉత్సవం ఘనంగా జరిగాయి. కమిటీ అధ్యక్షుడు మహేందర్ బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని.. గంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు.. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, నవీన్ యాదవ్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.
గంగా తెప్పోత్సవానికి మహిళలు, గంగపుత్రులు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రతి ఏటా జరిగే ఉత్సావాలు... సంప్రదాయ పద్ధతిలో నిర్వహించిన గంగా హారతి కార్యక్రమం భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక వాతావరణంలో సాగింది. తెలంగాణలోని మత్స్యకారులు, గంగపుత్రుల సంప్రదాయాలు, సంస్కృతి, ఆచారాలను గౌరవిస్తూ వాటిని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
హుస్సేన్ సాగర్ తీరంలో జరిగిన గంగా తెప్పోత్సవం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు. గంగపుత్రుల సంక్షేమం, మత్స్యకారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ సందర్భంగా గంగా మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దానంతో కలిసి మంత్రి పొన్నం నృత్యాలు చేస్తూ ఉత్సాహ పరిచారు.
