
- జీబీ లింక్పై ముందుకెళ్లకుండా ఏపీని ఆదేశించండి
- నీటి వాటాలు తేలనందున పీఎఫ్ఆర్ను తిరస్కరించండి
- ఈ ప్రాజెక్టుతో తెలంగాణ నీటి ప్రయోజనాలకు తీవ్ర విఘాతమని వెల్లడి
- హరీశ్రావు ఆరోపణలు అర్థరహితమని వ్యాఖ్య
- తెలంగాణ నీటిని ఏపీ దోచుకెళ్లేలా నాడు కేసీఆర్, జగన్ మధ్య చీకటి ఒప్పందం జరిగిందని మండిపాటు
హైదరాబాద్, వెలుగు: బనకచర్ల టెండర్లపై ముందుకెళ్లకుండా ఆంధ్రప్రదేశ్ను కట్టడి చేయాలని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్కు మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి లేఖ రాశారు. ఏపీ సమర్పించిన ప్రాజెక్ట్ ఫీజిబిలిటీ రిపోర్ట్ (పీఎఫ్ఆర్)కు ఆమోదం తెలపకముందే.. డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్) ఇవ్వాలని ఎలా అడుగుతారని ఆయన ప్రశ్నించారు. అంటే ఏపీ ఇచ్చిన పీఎఫ్ఆర్ను కేంద్రం ఆమోదించిందా? అని నిలదీశారు. ‘‘ఈ నెల 2న కేంద్ర ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి సజ్జన్ యాదవ్ నేతృత్వంలో ఏపీ అధికారులతో సమావేశం నిర్వహించినట్టు తెలిసింది. ఆ మీటింగ్కు కేంద్ర జలశక్తి శాఖ సీనియర్ జాయింట్ కమిషనర్ అమిత్ కుమార్ ఝా కూడా హాజరయ్యారు.
పీఎఫ్ఆర్ గురించి ఏపీ అధికారులు అడిగినప్పుడు.. దానిని సీడబ్ల్యూసీ పరిశీలిస్తున్నదని అమిత్ కుమార్ ఝా చెప్పారు. ఇదే సమయంలో జూన్ నెలాఖరులోగా డీపీఆర్ ఇవ్వాలంటూ ఏపీ ప్రభుత్వాన్ని సజ్జన్ యాదవ్ ఆదేశించారు. మామూలుగా అయితే పీఎఫ్ఆర్ను ఆమోదించాకే డీపీఆర్ను సమర్పించాలని సీడబ్ల్యూసీ అడగాల్సి ఉంటుంది. ఇప్పుడు డీపీఆర్ను సమర్పించాలని కేంద్రమే అడుగుతున్నది. అంటే పీఎఫ్ఆర్కు కేంద్రం ఆమోదం తెలిపిందా? ఈ నిర్ణయాన్ని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. గోదావరి – బనకచర్ల (జీబీ) లింక్ ప్రాజెక్టునూ వ్యతిరేకిస్తున్నాం. వెంటనే దాని పీఎఫ్ఆర్ను తిరస్కరించండి’’ అని మంత్రి ఉత్తమ్ తేల్చి చెప్పారు.
గోదావరి వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ అవార్డును, విభజన చట్టాన్ని ఉల్లంఘించి ఏపీ జీబీ లింక్ ప్రాజెక్టును చేపడుతున్నదంటూ ఈ ఏడాది జనవరిలో రాసిన లేఖలోనే ప్రస్తావించినట్లు మంత్రి ఉత్తమ్ గుర్తుచేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి గోదావరి ట్రిబ్యునల్ ఎలాంటి నీటి కేటాయింపులు చేయలేదని తేల్చి చెప్పారు. ‘‘స్పష్టమైన నీటి కేటాయింపులు లేనప్పుడు.. ఇలాంటి ప్రాజెక్టులకు సంబంధించిన పీఎఫ్ఆర్ను సీడబ్ల్యూసీ తిరస్కరిస్తుంది. డీపీఆర్ సమర్పించాలని అడగరు.
కానీ, ప్రస్తుతం జీబీ లింక్ విషయంలో కేంద్ర జలశక్తి శాఖ సీనియర్ జాయింట్ కమిషనర్ సమక్షంలోనే డీపీఆర్ సమర్పించాలంటూ ఏపీకి కేంద్ర ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి సూచించడం ఆందోళన కలిగించే అంశం. డీపీఆర్ అడిగారంటే పీఎఫ్ఆర్కు కేంద్రం ఆమోదం తెలిపిందని అనుకోవాల్సి ఉంటుంది. జీబీ లింక్ ప్రాజెక్టు గోదావరి ట్రిబ్యునల్ అవార్డు, విభజన చట్టానికి విరుద్ధం మాత్రమే కాదు.. తెలంగాణ రాష్ట్ర నీటి ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగిస్తుంది. జీబీ లింక్ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపితే.. అంతర్రాష్ట్ర నదీ జలాల విషయంలో సమాన, న్యాయమైన హక్కులను కల్పించడంలో కేంద్రం విఫలమైనట్టే’’ అని లేఖలో ఆయన పేర్కొన్నారు.
పీఎఫ్ఆర్ను తిరస్కరించండి..
ఏపీ సమర్పించిన జీబీ లింక్ పీఎఫ్ఆర్ను తెలంగాణ ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని తిరస్కరించాల్సిందిగా సీడబ్ల్యూసీకి ఆదేశాలివ్వాలని సీఆర్ పాటిల్ను ఉత్తమ్ కోరారు. ప్రస్తుతం అది సీడబ్ల్యూసీ వద్దే రివ్యూలో ఉందన్నారు. అంతేగాకుండా జీబీ లింక్ విషయంలో ఏపీ మరింత ముందుకు వెళ్లకుండా అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. డీపీఆర్ను సమర్పించకుండా, టెండర్ల ప్రక్రియను చేపట్టకుండా ఏపీని అడ్డుకోవాలన్నారు. విభజన చట్టం, ఇతర చట్టబద్ధమైన నిబంధనలను ఏపీ ఉల్లంఘించకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.
మిగులు జలాల్లేవ్..
గోదావరిలో మిగులు జలాల్లేవని గోదావరి ట్రిబ్యునల్ అవార్డులో పేర్కొన్నారని ఉత్తమ్ గుర్తు చేశారు. ఒకవేళ మిగులు జలాలున్నా రైపేరియన్ స్టేట్స్ (గోదావరి పరివాహక రాష్ట్రాల)కు వాటా ఉంటుందని ట్రిబ్యునల్ స్పష్టం చేసిందన్నారు. కాబట్టి మిగులు జలాలనే వాడుకుంటున్నామన్న ఏపీ వాదన అర్థరహితమని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి ఏపీకి గోదావరిలో 1486 టీఎంసీలు కేటాయించారని, రాష్ట్రవిభజన తర్వాత తెలంగాణకు 968 టీఎంసీలు ఇచ్చారని తెలిపారు.
ఆ కేటాయింపుల ఆధారంగా తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులు సీడబ్ల్యూసీ, జీఆర్ఎంబీ వద్ద పెండింగ్లో ఉండగా.. ఏపీ చేపడుతున్న ప్రాజెక్టుతో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. తాను గతంలో రాసిన లేఖకు రిప్లైగా.. ప్రాజెక్టుపై రివ్యూ చేస్తామని సీఆర్ పాటిల్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ, ఆ హామీకి విరుద్ధంగా ఏపీ ప్రాజెక్టుకు కేంద్రం సహకరిస్తున్నట్టుగా అనిపిస్తున్నదని ఆయన తాజా లేఖలో మండిపడ్డారు.
హరీశ్ ఆరోపణలు అర్థరహితం
ఏపీ జీబీ లింక్ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపణలు అర్థరహితమని మంత్రి ఉత్తమ్ అన్నారు. ‘‘ఏపీ బనకచర్ల ప్రాజెక్టుకు పూనుకున్న వెంటనే.. మా ప్రభుత్వం చర్యలను ప్రారంభించింది. ప్రాజెక్టుకు నిధుల కోసం ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాసిన వెంటనే.. నేను స్వయంగా కేంద్ర జలశక్తిశాఖ, కేంద్ర ఆర్థిక శాఖకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ లేఖ రాశాను. జనవరి 22నే లేఖ రాశాను. తాజాగా శుక్రవారం కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్కు లేఖ రాశాను. పీఎఫ్ఆర్ రిజెక్ట్ చేయాలని కోరాను. కాంగ్రెస్ ప్రభుత్వమేమీ మౌనంగా లేదు” అని శనివారం ఓ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. న్యాయపరంగా, సంస్థాగతంగా పోరాడుతూనే ఉన్నామన్నారు.
నదీ జలాల హక్కులపై తెలంగాణను బలహీనపరిచిందే గత బీఆర్ఎస్ ప్రభుత్వమని మంత్రి ఉత్తమ్ మండిపడ్డారు. ‘‘కృష్ణాలో తెలంగాణకు 724 టీఎంసీల వాటా దక్కాల్సి ఉన్నా.. 299 టీఎంసీలకు ఒప్పుకున్నదే వాళ్లు (బీఆర్ఎస్ వాళ్లు). అదే సమయంలో ఏపీకి 512 టీఎంసీలకు ఒప్పుకున్నారు. ఈ మోసమే ప్రస్తుత సంక్షోభానికి కారణమైంది. ముచ్చుమర్రి, మల్యాల నుంచి నీటిని ఏపీ తన్నుకుపోతున్నా నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఖరారై టెండర్లు పిలిచేదాకా వెళ్లినా.. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్కు వెళ్లలేదు. ఏపీ 3 టీఎంసీలు దోచుకెళ్తున్నా కేసీఆర్ సైలెంట్గా ఉన్నారు. తెలంగాణ నీటిని ఏపీ దోచుకెళ్లేలా కేసీఆర్, జగన్ మధ్య చీకటి ఒప్పందం జరిగింది” అని ఆయన అన్నారు.