- ట్రైనింగ్లో బాగా నేర్చుకుని క్వాలిఫై అయితే యూరప్లో ఉద్యోగాలు
- నెలకు రూ. 2.50 లక్షల వరకు శాలరీ వస్తదన్న మినిస్టర్
- మంత్రిగా ఏడాది పూర్తి.. భీమ్ సైనిక్, ప్రైవేటు ఉద్యోగుల ఫోరం సన్మానం
హైదరాబాద్ సిటీ/సిద్దిపేట, వెలుగు: భవిష్యత్తులో ప్లంబర్, ఎలక్ట్రికల్, కార్పెంటర్ లాంటి జాబ్స్కు మస్తు డిమాండ్ ఉంటుందని, అందుకే టామ్ కామ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ట్రైనింగ్ ఇచ్చి యూరప్ పంపిస్తోందని మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్పారు. మంత్రిగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మంత్రి వివేక్ వెంకటస్వామిని భీమ్ సైనిక్, ప్రైవేటు ఉద్యోగుల ఫోరం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఏఐ వల్ల వైట్ కాలర్ జాబ్స్ పోయే అవకాశం ఉందని, నాన్ టెక్నికల్ జాబ్స్ లక్షల్లో రానున్నాయన్నారు. దీని కోసం టామ్ కామ్ ద్వారా నిరుద్యోగులకు విదేశీ లాంగ్వేజెస్పై ట్రైనింగ్ ఇస్తున్నట్లు తెలిపారు. అయితే ట్రైనింగ్ తీసుకునే పిల్లల్లో పట్టుదల ఉండట్లేదని, క్రమశిక్షణతో స్కిల్స్ నేర్చుకోవాలని సూచించారు. టామ్ కామ్ ద్వారా ఉద్యోగం వస్తే విదేశాల్లో కనీసం రూ. 2.5 లక్షల జీతం వస్తుందని, దాదాపు ఏడాదికి రూ. 25 లక్షలు ఇంటికి పంపించవచ్చన్నారు. దీనికి సీఎం ఓవర్సీస్ స్కీం ద్వారా రూ. 2 లక్షలను 50 శాతం సబ్సిడీతో ప్రభుత్వమే ఇస్తుందన్నారు. ఇటీవల కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ కూడా ఏటీసీ సెంటర్లు, లాంగ్వేజ్ సెంటర్ల గురించి ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారని తెలిపారు. తెలంగాణ ప్రజల గొంతుక వినిపించేందుకు వీ6 చానెల్ను స్టార్ట్ చేశానని, ఉద్యమ సమయంలో ఎంత మంది ఒత్తిడి చేసినా తట్టుకుని నిలబడ్డామన్నారు. తెలంగాణ అమరుల కుటుంబాలకు తాను రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం చేశానన్నారు. గిగ్ వర్కర్ల చట్టం తెచ్చేందుకు తాను అందరినీ ఒప్పించానన్నారు.
సీఎం రేవంత్ పిలుపుతోనే కాంగ్రెస్లోకి వచ్చా..
2023 అసెంబ్లీ ఎలక్షన్లో తనకు నిలబడాలని లేకున్నా సీఎం రేవంత్ రెడ్డి పిలుపుతోనే కాంగ్రెస్లోకి వచ్చి పోటీ చేసినట్లు మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్పారు. 25 ఏళ్లలో చెన్నూరులో, 40 ఏళ్లలో బెల్లంపల్లిలో కాంగ్రెస్ గెలవలేదని.. కానీ తాము నిల్చొని గెలిస్తే ఒకే కుటుంబం నుంచి మూడు టికెట్లు ఎట్లా ఇస్తారని ఒక వ్యక్తి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల్లో ఉండే మనుషులను, ప్రజా సేవ చేసే వారిని ఓటర్లు గెలిపిస్తారన్నారు. తమపై చేస్తున్న విమర్శల్ని ఇప్పటికైనా మానుకోవాలని కోరారు. మాలలకు ఉద్యోగాల నోటిఫికేషన్లో 5 శాతం జాబ్స్ రావాల్సి ఉండగా.. 2 శాతం మాత్రమే వచ్చిందని, దీనిపై కేబినెట్ మీటింగ్లో కూడా ప్రస్తావించానని తెలిపారు. దీనిపై మాదిగ సోదరులకు కూడా అర్థమయ్యేలా చెప్పానన్నారు.
కాకాకు భారతరత్న ఇవ్వాలి
కాకా వెంకటస్వామికి భారత రత్న ఇవ్వాలని, తెలంగాణ పాఠ్య పుస్తకాల్లో కాకా చరిత్రను పాఠ్యాంశాలుగా చేర్చాలని పలువురు వక్తలు డిమాండ్చేశారు. జైపూర్ పవర్ ప్లాంట్ సృష్టికర్త, సింగరేణి ఉద్యోగులకు పెన్షన్ ప్రవేశపెట్టిన ఘనత కాకా వెంకటస్వామికే దక్కుతుందన్నారు. పేదల పక్షపాతి అయిన కాకాకు రాష్ట్రపతి పదవి వచ్చి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో భీమ్ సైనిక్ ఫౌండేషన్ గోసంగి సంఘం, తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం సభ్యులు కలికోట సత్యనారాయణ, రాములు, ఝాన్సీ, గ్యార శ్రీనివాస్ పాల్గొన్నారు.
రాహుల్ గాంధీని ప్రధానిని చేద్దాం
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధాని చేసే వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు విశ్రమించొద్దని సిద్దిపేట జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా శుక్రవారం సిద్దిపేట కాంగ్రెస్ క్యాంప్ ఆఫీస్లో నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఏఐ వల్ల వైట్ కాలర్ జాబ్లు పోతుండడంతో బ్లూ కాలర్ జాబ్లపై దృష్టి పెట్టి, ఆ దిశగా యువతకు శిక్షణ ఇవ్వాలని రాహుల్ గాంధీ సూచించారని వెల్లడించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుతో కలిసి పట్టణ శివార్లలోని రేణుక ఎల్లమ్మ దేవాలయంలో మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. లింగారెడ్డిపల్లి ఒకటవ వార్డులో తాగునీటి కోసం ఏర్పాటు చేసిన రెండు బోరు బావులను ప్రారంభించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సిద్దిపేట కాంగ్రెస్ ఇన్చార్జి పూజల హరికృష్ణ, ఏఎంసీ చైర్మన్లు దేవులపల్లి యాదగిరి, మీసం మహేందర్, సాకి ఆనంద్, వర్మ, మహేందర్, మద్దం లక్ష్మి, ఎస్టీడీ శ్రీనివాస్ పాల్గొన్నారు.
