వరంగల్ ఎంజీఎం కరోనా వార్డును సందర్శించిన మంత్రులు కేటీఆర్, ఈటెల

వరంగల్ ఎంజీఎం కరోనా వార్డును సందర్శించిన మంత్రులు కేటీఆర్, ఈటెల

వరంగల్: స్థానిక ఏం జి ఏం కొవిడ్ వార్డును మంత్రులు కేటీఆర్, ఈటెల రాజేందర్ సందర్శించారు. భారీ వర్షాలకు వరంగల్ నగరమంతా జలమయం కావడంతో హైదరాబాద్ నుండి హెలికాప్టర్ లో వచ్చిన మంత్రులు కరోనా బాధితులను పరామర్శించారు. తొలుత హెలికాఫ్టర్లో ఏరియల్ వ్యూ ద్వారా ముంపు ప్రాంతాలు.. పరిస్థితిని పరిశీలించిన అనంతరం స్థానిక ఆర్ట్స్ కాలేజీలో హెలికాఫ్టర్ దిగారు. అక్కడి నుండి సహచర మంత్రి ఈటెలతో కలసి సుమారు కిలోమీటరు కుపైగా దూరం నగరమంతా తిరుగుతూ.. ముంపు జరిగిన తీరును పరిశిలించారు. ఒక్కసారిగా ఇంత వరద ఎలా వచ్చిందో .. ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదని.. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ తోపాటు.. ఉన్నతాధికారులకు  మంత్రి  కే టి ఆర్  ఆదేశించారు.

వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో కరోనా వ్యాప్తి పరిస్థితిపై సంబంధిత అధాకారులతో మాట్లాడారు. నేరుగా ఎంజీఎం ఆస్పత్రికి వెళ్లారు. వార్డులో క్వారెంటైన్ లో చికిత్స పొందుతున్న పాజిటివ్ బాధితులతో మాట్లాడారు. పీపీఈ కిట్లు ధరించి వార్డులోకి వచ్చిన మంత్రి కేటీఆర్ ను బాధితులు గుర్తు పట్టలేకపోయారు. వైద్యులు.. సిబ్బంది చెప్పడంతో వారు తమ ఆరోగ్య పరిస్థితిని మంత్రి కేటీఆర్ కు వివరించారు. ధైర్యంగా ఉండాలని.. వైద్యులు మంచి చికిత్స అందించేలా చూస్తానని మంత్రి కేటీఆర్ బాధితులకు భరోసా కల్పించారు.