హైదరాబాద్, వెలుగు: టీఆర్ఎస్ను జాతీయ పార్టీగా మారుస్తున్న నేపథ్యంలో బుధవారం హైదరాబాద్ లో జోరుగా సంబరాలు చేస్తున్నామని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ తెలిపారు. సోమవారం తెలంగాణ భవన్లో పార్టీ నగర ఎమ్మెల్యేలు, ఇతర నేతలతో వారు సమావేశమయ్యారు. బుధవారం ఉదయం 11 గంటలకు టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభమవుతుందని, మధ్యాహ్నం సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించిన ప్రకటన చేస్తారని వెల్లడించారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ ఆవరణతో పాటు నగరంలోని అన్ని డివిజన్లలో భారీ ఎత్తున వేడుకలు నిర్వహిస్తామన్నారు.
పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఆహ్వానం పొందిన 283 మందితో పాటు టీఆర్ఎస్ ఆవిర్భావ సమయంలో ఉన్న ఉద్యమ నేతలనూ పిలవాలని పలువురు నాయకులు మంత్రులకు సూచించగా.. పార్టీ అధినేత దృష్టికి విషయం తీసుకెళ్తామని మంత్రులు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, కాలేరు వెంకటేశ్, సాయన్న, ముఠా గోపాల్, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, కార్పొరేషన్ల చైర్మన్లు రావుల శ్రీధర్ రెడ్డి, అయాచితం శ్రీధర్, గజ్జెల నగేశ్, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.