క్రాప్​లోన్లు కట్టాలని నోటీసులు.. సాగునీరు అందట్లేదని ప్రభుత్వంపై హరీశ్ రావు ఫైర్

క్రాప్​లోన్లు కట్టాలని నోటీసులు.. సాగునీరు అందట్లేదని ప్రభుత్వంపై హరీశ్ రావు ఫైర్

 హైదరాబాద్​: రైతులు క్రాప్​లోన్లు కట్టనందుకు బ్యాంకు అధికారులు రజాకార్లను తలపించేలా ప్రవర్తిస్తున్నారని బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే  హరీశ్​ రావు  అన్నారు. ఇవాళ  తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో  ఆయన మాట్లాడారు. గత పదేళ్లలో ఎప్పుడూ రైతులకు ఇలాంటి పరిస్థితి లేదని రైతులే చెబుతున్నారన్నారు. రాష్ట్రంలో సాగునీరు లేదు.. కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదన్నారు. సాగు నీరు లేక రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారన్నారు. పంటలు ఎండిపోతుంటే రైతన్న కన్నీటి పర్యంతమవుతున్నారన్నారు.  రైతులంగా తీవ్ర ఆందోళనలో ఉన్నారన్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని చెప్పారు.

రాష్ట్రంలో పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే సీఎం రేవంత్​రెడ్డికి పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర పార్టీల నుంచి చేరికలపై తప్ప రైతుల గురించి సీఎంకు ఆలోచన లేదని మండిపడ్డారు. రైతు కష్టాల్లో ఉంటే బ్యాంకుల వాళ్లు అప్పుల గురించి నోటీసులు ఇస్తున్నారని తెలిపారు. అప్పులు కట్టాలని బ్యాంకుల వాళ్లు రైతులను ఇబ్బంది పెడుతున్నారన్నారు. బకాయిలు కట్టకపోతే ఆస్తులు జప్తు చేస్తామని బ్యాంకు అధికారులు బెదిరిస్తున్నారని తెలిపారు.  రుణమాఫీపైనే మొదటి సంతకం చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారని ఆయన గుర్తు చేశారు. వంద రోజులైనా రేవంత్ రెడ్డి రుణమాఫీపై నిర్ణయం తీసుకోలేదన్నారు. రైతులకు ఇచ్చిన నాలుగు హామీలు ఇప్పటి వరకు ఒక్కటి కూడాఅమలు చేయలేదన్నారు.