డెడ్ లైన్ పెట్టినా తమ హక్కుల కోసం సమ్మెను కొనసాగిస్తూ ఆర్టీసీ కార్మికులు ధైర్యాన్ని చాటారని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ప్రభుత్వం పోలీసులతో కార్మికులను భయాందోళనకు గురి చేసినా వారు భయపడలేదని, తెలంగాణ ఉద్యమంలో చూపిన ధైర్యాన్ని, తమ హక్కుల సాధనకై రెట్టింపు పట్టుదలతో నిలబడ్డారని ఆయన అన్నారు.
చాలి చాలని జీతాలతో ఇబ్బంది పడే ఆర్టీసీ కార్మికులు, రిటైర్డ్ అయ్యాక వైద్యానికి కూడా ఖర్చులు లేక నానా బాధలు పడే పరిస్థితని జగ్గారెడ్డి అన్నారు. ఆర్టీసీ కార్మికుల జీవితాలతో సీఎం చెలగాటం ఆడుతున్నారని, భవిష్యత్తు లో కార్మికులకు సీఎం భారీ మూల్యం చెల్లించక తప్పదని అన్నారు. రాష్ట్రానికి తండ్రి లాంటి వాడైన సీఎం.. బిడ్డల లాంటి కార్మికులను పిలిచి చర్చలు జరపాలని ఎమ్మెల్యే సూచించారు.