
చండూరు, వెలుగు : అక్రమ మట్టి దందాను ప్రశ్నించిన యూత్ కాంగ్రెస్ తుంగతుర్తి నియోజకవర్గ ఉపాధ్యక్షుడు కప్పల రాజేశ్ పై ఈనెల 21న దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో గాయపడిన రాజేశ్ వనస్థలిపురంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంగళవారం ఆస్పత్రికి వెళ్లి రాజేశ్ను పరామర్శించారు. దాడికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు ఆయన సూచించారు.
దత్తురెడ్డి హఠాన్మరణం కలచి వేసింది..
ఈనాడు దినపత్రిక వరంగల్ జిల్లా ప్రతినిధి జీడిపల్లి దత్తురెడ్డి అకాల మరణం తనను ఎంతో కలచి వేసిందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జర్నలిజంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాల్సిన ఆయన.. చిన్న వయసులో గుండెపోటుతో మృతి చెందడం బాధాకరమని తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లా ఈనాడు బ్యూరోగా పనిచేసిన దత్తురెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. మృతుడి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ఇవ్వాలని భగవంతుడిని కోరుకుంటున్నట్లు తెలిపారు.