
చండూరు, వెలుగు : ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునే పేదలపై ఆర్థిక భారం పడకుండా చూడాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్రషర్ యజమానులను కోరారు. గురువారం మునుగోడులోని క్యాంపు ఆఫీసులో క్రషర్ యజమానులతో సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు కలిసి స్థానికంగా ఉన్న వాగుల నుండే ఉచితంగా ఇసుకను తీసుకునే విధంగా అనుమతులు ఇప్పించాలని ఎమ్మెల్యేను కోరారు.
వెంటనే మైనింగ్ అధికారులు, కలెక్టర్ తో మాట్లాడి అనుమతులు ఇవ్వాలని సూచించారు. మరోవైపు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న సిమెంట్ పరిశ్రమల యజమానులతో కూడా మాట్లాడి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునే వారికి తక్కువ ధరకు సిమెంట్ఇప్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
చేనేత శాలువాలు వాడండి..
తనకు శాలువాలు కప్పాలనుకునేవారు సిల్క్ శాలువాలు కాకుండా.. చేనేత శాలువాలతో రావాలని కోరారు. నియోజకవర్గంలో ఎందరో నేతన్నలు తమ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారని చెప్పారు. నేతన్నలు తయారు చేసే శాలువాలు కొనడం వల్ల వారికి జీవనోపాధి కల్పించిన వాళ్లమవుతామని తెలిపారు. ప్రతిఒక్కరూ నేత కార్మికులు తయారు చేసిన శాలువాలు కొనుగోలు చేయాలని సూచించారు. అనంతరం మునుగోడులోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలో కొనసాగుతున్న బెల్ట్ షాపులపై చర్చించారు. బెల్ట్ షాపుల నిర్వహణపై స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని పోలీసులకు చెప్పారు.