ఉస్మానియా ఆస్పత్రిలో ఎక్కడ చూసినా చెత్త, చెదారమే: ఎమ్మెల్యే రాజాసింగ్

ఉస్మానియా ఆస్పత్రిలో ఎక్కడ చూసినా చెత్త, చెదారమే: ఎమ్మెల్యే రాజాసింగ్

హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మంగ‌ళ‌వారం ఉస్మానియా ఆసుప‌త్రిని సంద‌ర్శించారు. ఆసుప‌త్రిలో కొద్దిపాటి వ‌ర్షానికే నీళ్లు చేరాయని, నీళ్ళతో పాటు చెత్త కూడా చేరిందని అన్నారు. ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రికి సూపరిండెంట్ ఇన్‌చార్జ్‌గా పాండు నాయ‌క్‌ని పెట్టారన్న రాజాసింగ్..ఆయనకు మర్యాద ఇవ్వడం కూడా తెలియదని విమ‌ర్శించారు. వర్షానికి నీళ్ళు చేరాయనీ ,చెత్త కూడా ఎక్కడపడితే అక్కడ పేరుకుపోయిందననే విష‌యాన్ని తెలుప‌గా.. “మేము అన్ని చేస్తున్నాం, చూస్తున్నా”మని సమాధానం చెబుతున్నారు తప్ప పని మాత్రం చేయడం లేద‌ని అన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఉస్మానియా ఆసుపత్రినీ మోడల్ ఆసుపత్రిగా చేస్తానని, కొత్త భవనాలు నిర్మిస్తానని మాటలు చెప్పారు.. కానీ ఆస్పత్రిలో ఎక్కడ చూసినా చెత్త, చెదారం కనబడుతుందన్నారు. ఇక్కడ ఐసోలేషన్ వార్డు కూడా లేద‌ని, ఇతర సదుపాయాలు ఏమీ లేవని అన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ నిద్రపోతున్నారని, ఆయ‌న‌కు అధికారంలో ఉండే హక్కే లేదని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులన్నీ ఉస్మానియా ఆస్పత్రి మాదిరిగా కాకుండా ఉండాలంటే సీఎం ప్రభుత్వ ఆసుపత్రులను సందర్శించి.. అక్క‌డ వసతులు కల్పించాల‌న్నారు. అప్పుడే వాస్తవాలు తెలుస్తాయ‌ని అన్నారు. పేద ప్రజలంతా చనిపోతున్నారని, వారి ప్రాణాలు కాపాడాల‌ని అన్నారు.