చెన్నూరు ఆసుపత్రిని గత ​ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది : వివేక్​వెంకటస్వామి

చెన్నూరు ఆసుపత్రిని గత ​ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది : వివేక్​వెంకటస్వామి

కోల్​బెల్ట్/చెన్నూరు/బెల్లంపల్లి, వెలుగు: చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిని బీఆర్ఎస్ ​ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని.. డాక్టర్లు, స్టాఫ్ కొరత ఉన్నా పట్టించుకోలేదని ఎమ్మెల్యే డాక్టర్​ వివేక్​వెంకటస్వామి విమర్శించారు. బుధవారం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్​ను ఆయన ఓపెన్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్​మాట్లాడుతూ.. కనీసం వైద్య పరికరాలు అందుబాటులో లేకపోవడంతో సాధారణ ట్రీట్​మెంట్ కూడా అందడం లేదన్నారు.

 30 బెడ్ల​ఆసుపత్రికి సరిపడా సౌలత్​లు లేవన్నారు. సర్జికల్ ఆపరేషన్​ థియేటర్, డయాలసిస్​యూనిట్లు ఏర్పాటు చేసి, డాక్టర్లు, స్టాఫ్​ను రిక్రూట్​చేయాలని వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కలిసి విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. నెల రోజుల్లో అన్ని వసతులు కల్పిస్తామన్నారు. ఆయన వెంట ఉమ్మడి జిల్లా మాజీ జడ్పీ వైస్​ చైర్మన్​మూల రాజిరెడ్డి, మంచిర్యాల జిల్లా సూపరిటెండెంట్​డాక్టర్ అరవింద్, చెన్నూరు ఆసుపత్రి డాక్టర్​ సత్యనారాయణ, లీడర్లు పాల్గొన్నారు.

 అనంతరం చెన్నూరు గర్ల్స్ హై స్కూల్ ను  ఎమ్మెల్యే వివేక్ సందర్శించారు. అక్కడి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. తర్వాత బైక్​పై పట్టణంలో పర్యటించారు. కిరాణం షాప్ యజమాని హీరోలాల్, కురుమ పున్నం, అన్నపూర్ణ వృద్ధాశ్రమం నిర్వాహకులు పుల్లూరి సత్తయ్య, పడమటిరెడ్డి శ్రీనివాస్, వెంకన్న, చింతల శ్రీనివాస్, కొత్తగూడెం కాలనీలోని ఇటీవల గాయపడిన కాంగ్రెస్ కార్యకర్త తగరం కృష్ణ కుటుంబాలను కలిశారు. 

మున్సిపాలిటీలకు డీఎంఎఫ్​టీ ఫండ్స్ అవసరం

డీఎంఎఫ్​టీ ఫండ్స్​ను మున్సిపాలిటీల అభివృద్ధికి వెచ్చించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే వివేక్​వెంకటస్వామి అన్నారు. బుధవారం సాయంత్రం జరిగిన క్యాతనపల్లి మున్సిపల్ జనరల్​బాడీ మీటింగ్​లో ఆయన పాల్గొని మాట్లాడారు. రూ.37 కోట్లను రోడ్​వైడనింగ్​కు కేటాయించడం సరికాదన్నారు. తాగునీరు, డ్రైనేజీ, రోడ్ల కోసం డీఎంఎఫ్​టీ ఫండ్స్ ఖర్చు చేస్తే  సౌలతులు పెరుగుతాయన్నారు. అనంతరం ఎమ్మెల్యే వివేక్​ను చైర్మన్​జంగం కళ, వైస్​ చైర్మన్​ సాగర్​రెడ్డి, కమిషనర్​ వెంకటనారాయణ, మేనేజర్​ నాగరాజు, కౌన్సిలర్లు, ఉద్యోగులు, ఆర్జీ, అంగన్​వాడీ టీచర్లు సన్మానించారు. 

అంతకు మందు ఆదిలాబాద్​వెళ్తున్న మంత్రి సీతక్క మంచిర్యాలలోని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఇంటికి వచ్చారు. వివేక్ మంత్రికి శాలువా కప్పి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. బెల్లంపల్లిలోని అయ్యప్పస్వామి దేవాలయంలో బుధవారం రాత్రి నిర్వహించిన మహా పడిపూజలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు.