ముంబై: ప్రధాని నరేంద్ర మోదీతో తనకు రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ, అంతర్జాతీయంగా ఆయన భారత ప్రతిష్టను కాపాడడానికి కృషి చేస్తున్నారనే విషయాన్ని ఎవ్వరూ మరచిపోవద్దని ఎన్సీపీ (ఎస్పీ) అధ్యక్షుడు శరద్ పవార్ అన్నారు. మంగళవారం సాయంత్రం పుణెకు చెందిన లక్ష్మణ్రావ్ గుట్టే రూరల్ డెవలప్మెంట్ ఫౌండేషన్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పవార్ఈ వ్యాఖ్యలు చేశారు. జాతీయ ప్రయోజనాల కోసం సమష్టిగా పనిచేసే అవకాశం వచ్చినప్పుడు అందరూ ఒకే లక్ష్యంతో ముందుకువెళ్లాలన్నారు. మాజీ ప్రధానమంత్రులు ఇందిరా గాంధీ, పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ వంటి నాయకులు ఎల్లప్పుడూ దేశ భవిష్యత్తును కేంద్ర బిందువుగా ఉంచుకున్నారని గుర్తుచేశారు. వివిధ పార్టీలకు చెందిన మాజీ సహచరులు ఒకచోట చేరడాన్ని ఎన్సీపీ (ఎస్పీ) అధినేత స్వాగతించారు. ఇలాంటి కార్యక్రమాలను కొనసాగించాలని కోరారు. కాగా శివసేన (యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్ మాత్రం పవార్ వ్యాఖ్యలతో విభేదించారు. " శరద్పవార్ ప్రకటనతో మేము ఏకీభవించడం లేదు. ప్రధాని కచ్చితంగా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, నరసింహారావు, మన్మోహన్ సింగ్ విదేశాలకు వెళ్లినప్పుడల్లా పత్రికలతో మాట్లాడేవారు. వారు సమాధానాలు చెప్పకుండా పారిపోలేదు" అని రౌత్ విమర్శించారు.
