
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ నేతృత్వంలోని పదకొండేండ్ల పాలన ప్రజా సేవలకు స్వర్ణయుగమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. మోదీ హయాంలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చామన్నారు. అద్భుతమైన పనితీరుతో దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ప్రధానిగా నరేంద్ర మోదీ మూడో సారి బాధ్యతలు చేపట్టి సోమవారం (June 9) నాటికి ఏడాది, మొత్తంగా 11 ఏండ్లు పూర్తయ్యాయి.
ఈ సందర్భంగా అమిత్షా ట్వీట్ చేశారు. ‘‘ఈ 11 ఏండ్ల మోదీ పాలన ప్రజా సేవ పట్ల సంకల్పం, కృషి, అంకితభావంతో కూడిన స్వర్ణయుగం”అని కొనియాడారు. ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు తేవడంతోపాటు, దేశాన్ని ప్రతి రంగంలోనూ నంబర్ 1గా మార్చే ఈ ప్రయాణం కొనసాగుతుందని అన్నారు. ఆర్థిక పునరుజ్జీవనం, సామాజిక న్యాయం, సాంస్కృతిక గర్వం, జాతీయ భద్రత కల్పించడంలో దేశం కొత్త శకాన్ని చూసిందన్నారు. సరైన నాయకత్వం, గట్టి సంకల్పం, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం ఉంటే సుపరిపాలన అందించడంలో కొత్త రికార్డులు నమోదవుతాయని మోదీ సర్కార్ నిరూపించిందని అమిత్ షా పేర్కొన్నారు.
దేశాన్ని సరైన దిశలో నడిపిండు..
2014లో మోదీ పగ్గాలు చేపట్టినప్పుడు, దేశంలో విధానపరమైన అనేక లోపాలున్నాయని అమిత్ షా గుర్తుచేశారు. అప్పటికి.. సరైన నాయకత్వం లేక అవినీతి పరాకాష్టకు చేరుకుందన్నారు. అస్తవ్యస్థమైన పాలన కారణంగా ఆర్థిక వ్యవస్థ దిక్కుతోచని పరిస్థితిలో ఉందని గుర్తుచేశారు. వాటన్నింటినీ మోదీ సర్కారు గాడిలో పెట్టిందన్నారు. 11 ఏండ్లలో రైతులు, దళితులు, అణగారిన వర్గాల అభివృద్ధే లక్ష్యంగా ప్రధాని నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. మోదీ సర్కారులో బుజ్జగింపు రాజకీయాలకు తావివ్వలేదని, సబ్కా సాథ్, సబ్కా వికాస్ అనే నినాదంతో ముందుకెళ్తోందని అన్నారు.
సువర్ణాక్షరాలతో లిఖించదగిన కాలం: జేపీ నడ్డా
మోదీ పాలనలో దేశ రాజకీయాల్లో అద్భుతమైన మార్పులు వచ్చాయని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా అన్నారు. 11 ఏండ్లలో మోదీ చేసిన అభివృద్ధి పనులు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినవని కొనియాడారు. 370 ఆర్టికల్ రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు, నోట్ల రద్దు, వక్ఫ్ బోర్డు సవరణ చట్టం, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారని గుర్తుచేశారు.