టాలీవుడ్లో డ్రగ్స్ వ్యవహారంలో జరిగిన లావాదేవీలపై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు విచారణ జరుపుతోంది. ఇప్పటికే డైరెక్టర్ పూరి జగన్నాథ్, నటి చార్మి,నటి రకుల్ ప్రీత్ సింగ్ విచారణకు హాజరై పలు వివరాలు తెలిపారు. ఇవాళ(మంగళవారం) నటుడు నందు ఈడీ అధికారుల ముందు విచారణకు హాజరయ్యాడు. నందును ఈ నెల 20న హాజరు కావాలని ఈడీ ఆదేశాలు జారీచేసింది. అయితే.. ఆ రోజు ఆయనకు వేరే పనులున్న కారణంగా, ఈ రోజే ఈడీ అధికారుల ముందు విచారణకు హాజరయ్యాడు.
మనీలాండరింగ్ కేసులో నందును అధికారులు విచారిస్తున్నారు. అతని బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్నారు. అనుమానాస్పద లావాదేవీలపై ప్రశ్నిస్తున్నారు. డ్రగ్స్ కేసులో నిందితుడుగా ఉన్న కెల్విన్ కొన్ని రోజుల క్రితం ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారుల ముందు లొంగిపోవడంతో అధికారులు ఆయన నుంచి కీలక వివరాలు రాబట్టారు. ఆయన ఇచ్చిన సమాచారంతో తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.